Janasena: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీలో టికెట్ దక్కని నేతలు పక్క పార్టీలో చేరి టికెట్ లు దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలు జనసేన పార్టీలో చేరారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ లు ఆశిస్తున్న జనసేన నాయకులకు బిగ్ షాక్ తగిలింది. ఈ పరిణామంతో జనసేన ఆశావహులు అగ్గిలంమీద గుగ్గిలం అవుతున్నాయి. ఎంతో కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న తమకు అవకాశం ఇవ్వకుండా పక్క పార్టీ నుండి వచ్చిన వాళ్లకి టికెట్ లు ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణాజిల్లా ఆవనిగడ్డ, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధులను జనసేన ఇంత వరకూ ప్రకటించలేదు. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులకు ధీటైన నేతల కోసం ఇప్పటి వరకూ జనసేన కసరత్తు చేసింది. ఆయా నియోజకవర్గాల జనసేనలో సరైన అభ్యర్ధులు లేకపోవడంతో టీడీపీ నుండి సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకుని అభ్యర్ధిత్వాలు ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో టీడీపీలో సీనియర్ నేతలుగా ఉన్న మండలి బుద్దప్రసాద్, నిమ్మక జయకృష్ణ లు ఇవేళ జనసేన పార్టీలో చేరారు. ఫిఠాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో బుద్దప్రసాద్, జయకృష్ణలు పార్టీలో చేరారు. వీరికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ ఇద్దరు నేతలు టీడీపీకి రాజీనామా చేసి జనసేన లో చేరడంతో వీటికే టికెట్ ఇస్తారని తెలుస్తొంది. మండలి బుద్దప్రసాద్ కాంగ్రెస్ పార్టీ తరపున 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి ఓట్ల చీలిక ప్రభావంతో ఒటమి పాలైయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటి స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి సింహాద్రి రమేష్ చేతిలో పరాజయం పాలైయ్యారు. ఈ సారి ఎన్నికల్లోనూ పోటీ చేయాలని ఆయన భావిస్తుండగా, పొత్తులో భాగంగా ఆవనిగడ్డను జనసేన కు కేటాయించడంతో టీడీపీ నుండి పోటీ చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. దీంతో జనసేన గూటికి చేరారు.
ఇక నిమ్మక జయకృష్ణ పాలకొండ నియోజకవర్గం నుండి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. వైసీపీ అభ్యర్ధి విశ్వసరాయ కళావతి చేతిలో నిమ్మక జయకృష్ణ రెండు సార్లు ఓటమి పాలైయ్యారు. ముచ్చటగా మూడో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిమ్మక జయకృష్ణ భావిస్తుండగా, పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించడంతో జనసేన గూటికి చేరాల్సి వచ్చింది.
ఈ ఇద్దరు నేతలు జనసేనలో చేరడంతో ఆవనిగడ్డ, పాలకొండ స్థానాలకు సంబంధించి అభ్యర్ధిత్వాలపై ఒక స్పష్టత వచ్చింది. వీరి అభ్యర్ధిత్వాలను నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే వీరు ఇద్దరు నేతలు జనసేనలో చేరి అభ్యర్ధులుగా నిలవడంపై టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా, జనసేన ఆశావహులు, వారి మద్దతుదారులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో ఆయా నియోజకవర్గాల్లోని కొందరు జనసేన నేతలు పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
CM YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు