TDP Srikakulam: ఓ పక్క అధికార వైసీపీ నియోజకవర్గాల అభ్యర్ధులను ఖరారు చేస్తూ ముందుకు వెళుతుంటే, టీడీపీ మాత్రం అభ్యర్ధుల ఎంపిక చేయకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో ఆశావహ నేతల గ్రూపు విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఎవరికి వారు తమకే టికెట్ అని ప్రచారం చేసుకోవడం, జనాల్లోకి వెళుతుండటంతో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల తన్ను లాటలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు.
తాజాగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో టీడీపీలోని రెండు గ్రూపులు బాహాబాహికి దిగడం గ్రూపు విభేదాలు మరో సారి బహిర్గతం అయ్యాయి. శ్రీకాకుళం టీడీపీ టికెట్ ఆశిస్తున్న గొండు శంకర్ పై మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గీయులు దాడికి దిగారు. ఒకరి నొకరు తోసుకుని నువ్వేంతంటే నువ్వెంత అని ఘర్షణకు దిగారు. దాదాపు గంట పాటు ఇరువర్గాల మధ్య మాటల యుద్దం జరిగింది.
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీలో అయిదేళ్లుగా వర్గపోరు నడుస్తొంది. గొండు శంకర్, గుండ లక్ష్మీదేవి వర్గీయులుగా టీడీపీ విడిపోయి ఉంది. ఇరు వర్గాలు గతంలో పలు మార్లు దాడులు చేసుకోవడం, పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడం కూడా జరిగింది. గతంలో టీడీపీ నేతల్లో క్రమశిక్షణ ఉండేది. ఇప్పుడు ఆ పార్టీలో నేతలు క్రమశిక్షణ మీరుతున్నారు. ఎవరికి ఇష్టమొచ్చినట్లుగా వారు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అధిష్టానం కూడా గ్రూపు విభేదాలను ప్రోత్సహిస్తూ వస్తొంది. దీంతో నియోజకవర్గాల్లోని వర్గ విభేదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. ప్రజల్లో పల్చన అవుతున్నారు.
అసలు ఏమి జరిగింది అంటే..?
గొంతు శంకర్ తన వర్గీయులతో బుధవారం శ్రీకాకుళం టౌన్ లోని రెల్లి వీధిలో ఇంటింటికీ శంకరన్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి గుండ లక్ష్మీదేవి వర్గీయుడైన పట్టణ టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేశ్, వార్డు ఇన్ చార్జి కళ్యాణి వెంకటరావు, జలగడుగుల జగన్, కవ్వాడి సుశీల తదితరులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. శంకర్ తో వాదనకు దిగారు.
‘నువ్వెవడివి..? నువ్వు ఎక్కడోడివి..? నీకిక్కడేం పని..? నువ్వు ఇన్ చార్జివా..? ఇన్ చార్జి లేకుండా కార్యక్రమం ఏమిటి..? వేషాలు వేయకండి..? తమాషా చేస్తున్నారా..? ఎక్కువ చేస్తే తరిమి తరిమి కొడతాం.. అంటూ ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం జరిగింది. ఇవేమీ పట్టించుకోకుండా శంకర్ ముందుకు వెళ్లడంతో పాలకొండ రోడ్డులో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు చేయు చేసుకున్నారు. టీడీపీలోని రెండు వర్గాల వీరంగంతో అక్కడ ఉన్న ప్రజలు భయాందోళనకు గురైయ్యారు.