హైదరాబాద్: దారుణ హత్యకు గురయిన ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఇప్పటికే పలు పార్టీల ప్రజాప్రతినిధులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు, ప్రియాంక కేసును సుమోటాగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కూడా ప్రియాంకరెడ్డి ఇంటికి వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చారు.
ఇదిలా ఉంటే షాద్నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటనపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో ర్యాలీలు కొనసాగుతున్నాయి. నిందితులను ఉరి తీయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.