(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పాండునాయక్ (తహశీల్దార్) 14 రోజుల రిమాండ్ విధించారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, నిందితులను బయటకు తీసుకురావడం సురక్షితం కాదని భావించిన పోలీసులు.. మేజిస్ట్రేట్ నే పోలీస్ స్టేషన్ కు రప్పించారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను మహబూబ్ నగర్ జిల్లా జైలుకు పోలీసులు తరలించనున్నారు.
పోలీస్స్టేషన్ బయట తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. మహిళలు, ప్రజాసంఘాల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంయమనంగా ఉండాలని విజ్ఞప్తి చేసినా నిరసనకారులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు షాద్నగర్కు చేరుకున్నారు. పోలీసులపైకి చెప్పులు విసరడం, పీఎస్లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.