తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా పార్టీలు చేరికలపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ, మరో పక్క కర్ణాటక లో గెలుపు స్పూర్తితో తెలంగాణలోనూ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ .. సీనియర్ లను పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని కొనసాగిస్తొంది. ఇరు పార్టీలు ఆపరేషన్ ఆకర్షన్ ను వేగవంతం చేశాయి.
మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మెదక్ డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అరరాజుల శ్రీదేవి, సంజీవరావు త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుండగా, తాజాగా సీనియర్ హీరోయిన్, మాజీ ఎమ్మెల్యే జయసుధ ఇవేళ ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. జయసుధ 2009 లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుండి పోటీ చేసి గెలిచారు. జయసుధ రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుండి బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న జయసుధ ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్ , బండి సంజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మరో పక్క కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మాగారెడ్డి, ఎమ్మెల్సీ దామోదరరెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తొంది. అధికార బీఎర్ఎస్ నుండి బహిష్కకరణకు గురైన తర్వాత జూపల్లి తదితర నేతలు సుదీర్ఘ సమయం తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరు పార్టీలో చేరికకు కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించి అందుకు సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించినా భారీ వర్షాలు కారణంగా రెండు సార్లు సభ వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఢిల్లీకి వెళ్లి పార్టీలో చేరడమే సమంజసమని భావించారు. జూపల్లి తదితర నేతలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పిలుపు రావడంతో బయలుదేరి వెళ్లారు. ఇవేళ సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితర ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వేతనం రూ.15వేలు పెంపు .. ఎప్పటి నుండి అంటే..?