మనుషుల్లో నేరప్రవృత్తి పెరిగిపోతోంది.ఎదుటి వారి ప్రాణాలంటే లెక్క లేకుండా ఉంది.అతి సిల్లీ కారణానికి కూడా హత్యలకు సిద్ధమైపోతున్నారు.ఉల్లిపాయలు తరిగినంత సులువుగా మనుషుల గొంతులను కూడా కూడా కోసేస్తున్నారు.
ఉల్లిపాయ అంటే గుర్తుకొచ్చింది .దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా ఒక ఉల్లిపాయ కోసం హత్యాయత్నం జరిగింది!వివరాల్లోకి వెళితే రాత్రి డిన్నర్ లో అదనపు ఉల్లిపాయలు ఇవ్వలేదనే కోపంతో తోటి కూలిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు మరొక కూలీ. దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరి వద్ద డిసెంబర్ 8న ఈదారుణం జరగింది. రియాసత్ అలీ(59) పవన్(60) అనే ఇద్దరు వ్యక్తులు కూలి పనుల కోసం ఫతేపూర్ బేరి వద్ద ఉన్న ఎస్బీ ఫామ్ లో చేరారు.డిసెంబర్ 8వ తేదీ రాత్రి పని పూర్తయిన తర్వాత రాత్రిభోజనం చేయాటానికి రెడీ అయ్యారు.
అయితే వారికి భోజనంలో సలాడ్ ఇచ్చారు. సలాడ్ లో తినేందుకు అదనంగా కొన్ని ఉల్లిపాయలు కావాలాని అలీ, పవన్ ను కోరాడు.అదనంగా ఇచ్చేందుకు ఉల్లిపాయలు లేవని ఉన్నవాటితోనే తినమని పవన్ చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపం పట్టలేని అలీ …. కిచెన్ లో ఉండే కత్తితో పవన్ పై విచక్షణా రహితంగా దాడి చేసి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని బాధితుడ్ని ఎయిమ్స్ ట్రామా సెంటర్ కి తరలించారు. ప్రస్తుతం పవన్ ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడని వైద్యులు తెలిపారు.
బాధితుడి కుటుంబ సభ్యుల నుండి ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా అలీని పట్టుకోటానికి పోలీసులు విస్తృతంగా గాలించారు. సుమారు 500 మంది కూలీలను విచారించారు. అతి కష్టం మీద చివరికి ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని లేబర్ క్యాంపు వద్ద పుట్ పాత్ పై పడుకుని ఉండగా అరెస్ట్ చేశారు. హత్యయత్నానికి ఉపయోగించిన మారణాయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులను విచారించగా కేవలం అదనపు ఉల్లిపాయ కోసం అంత ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పడంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది.