ఉమ్మడి విశాఖ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాడేరు. జిల్లాలు విభజన తర్వాత అల్లూరి సీతా రామరాజు జిల్లాలో ఈ నియోజకవర్గం చేరింది. పాడేరు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. వీటిలో పాడేరు, జి మాడుగుల, చింతపల్లి, జికే వీధి, కొయ్యూరు ఉన్నాయి. ఇప్పటి వరకు 16 ఎన్నికలు జరిగాయి. 1985లో తొలిసారి ఇక్కడ టీడీపీ విజయం దక్కించుకుంది. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎం బాలరాజు విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన కే చిట్టి నాయుడు విజయం సాధించారు.
ఇక, 1999లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన మత్య్సరాస మణికుమారి విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఎల్ రాజారావు విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పసుపులేటి బాలరాజు గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విజయం సాధించారు. అంటే.. ఇక్కడ కేవలం రెండు సార్లు మాత్రమే వరుసగా ఒక పార్టీ విజయం దక్కించుకుంది.
1994, 1999లో టీడీపీ, 2014, 2019లో వైసీపీ గెలుపుగుర్రాలు ఎక్కాయి. ఇక, మిగిలిన ఎన్నికల్లో మాత్రం ఇక్కడి ప్రజలు పార్టీలను మార్చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇదే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి మరోసారి బరిలో దిగేందుకు సిద్ధమవు తున్నారు. అధికార వైసీపీ అభ్యర్థిని మారుస్తోంది. ఇప్పటికి రెండుసార్లు ఇన్చార్జిలను మార్చిన వైసిపి.. తాజాగా మత్స్యరాస విశ్వేశ్వరరాజును నియమించింది. అయినప్పటికీ.. లోలోన మాత్రం భయంగానే ఉంది.
పాడేరు ప్రజల మూడ్ ఎలా ఉంటుందనేది కీలకంగా మారింది. ఎస్టీ నియోజకవర్గం అయిన పాడేరులో గిరిజనులు.. ఒకే మాట అనుకుంటారు. ఎన్నికలకు ముందు అత్యంత రహస్యంగా గూడేలు, తండాల్లో సభలు పెట్టుకుంటారు. దీనిలో చేసిన తీర్మానం మేరకు వారు ఓటు వేస్తారు. ప్రస్తుతం వైసీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. కీలకమైన రహదారి నిర్మాణం లేక.. ఇక్కడిరోగులు వైద్యశాలలకు వెళ్లేందుకు డోలీలు కట్టుకుంటున్నారు. దీనిని పరిష్కరిస్తామన్న వైసీపీ నేతలు ఇప్పటికీ పనిచేయలేదు. ఇది ప్రధాన సమస్యగా మారనుంది.