వైసీపీ అధినేత జగన్ సమన్వయకర్తల విషయంలో తీసుకుంటోన్న నిర్ణయాలు పార్టీ కేడర్లో పెద్ద కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఎవరు ? ఎప్పుడు ఏ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉంటారో ఎప్పుడు అవుట్ అవుతారో తెలియడం లేదు. తాజాగా గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్యను పార్టీ అధిష్టానం నియమించడంతో పార్టీ కేడర్ తలలు పట్టుకుంటోంది. గత ఎన్నికల్లో పార్టీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.
అప్పటి నుంచి గుంటూరు పార్లమెంటు వైసీపీ పగ్గాలు ఎవరికి అప్పగించాలా అని వైసీపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతూ వస్తోంది. ఈ టైంలో టీం ఇండియా క్రికెటర్ అంబటి రాయుడు గత యేడాది కాలంగా గుంటూరు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వస్తున్నారు. వైసీపీ కేడర్తోనూ ఆయన చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. అంబటి రాయుడే గుంటూరు పార్లమెంటుకు పోటీ చేస్తారంటూ బాగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగినట్టే రాయుడు వైసీపీలో కూడా చేరారు.
ఏమైందో గాని వైసీపీలో చేరిన వారం రోజులకే రాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిశారు. రాయుడు బయటకు వెళ్లిపోయాక ఆ ప్లేస్లోకి వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు హైదరాబాద్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ నడుపుతోన్న ఉమ్మారెడ్డి వెంకటరమణను పార్టీ అధిష్టానం గుంటూరు సమన్వయకర్తగా ఎంపిక చేసింది. తన వారసుడిగా వెంకట రమణను ప్రమోట్ చేయాలని వెంకటేశ్వర్లు గత 20 ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
ఎట్టకేలకు తన కోరిక తీరిందని ఉమ్మారెడ్డి ఆనందపడ్డారు. వెంకటరమణను గుంటూరు పార్లమెంటు వైసీపీ సమన్వయకర్తగా ఎంపిక చేసి 20 రోజులు కూడా కాలేదు. ఆయన మధ్యలో రెండు మూడు సార్లు గుంటూరు వచ్చారు.. చాలా ఉత్సాహంగా కనిపించారు. అంతలోనే ఏమైందో గాని ఆయన ఐదారు రోజుల నుంచి సడెన్గా సైలెంట్ అయిపోయారు. అసలు పార్టీలో కూడా యాక్టివ్గా లేరు. దీంతో మరో షాకింగ్ న్యూస్ వైసీపీ అధిష్టానం నుంచి బయటకు వచ్చేసింది.
ఉమ్మారెడ్డి వెంకటరమణను తప్పించేసి ఆ ప్లేసులోకి పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారు రోశయ్యను పార్లమెంటు నియోజకవర్గ సమన్యయకర్తగా నియమించింది. పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న రోశయ్య మరోసారి అక్కడే పోటీ చేయాలని అనుకున్నారు. ఇంతలోనే ఆయనకు అధిష్టానం షాక్ ఇస్తూ గుంటూరు పార్లమెంటుకు పంపింది. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు రోశయ్య గుంటూరు వైసీపీ పార్లమెంటు ఇన్చార్జ్గా ఉన్నారు. అయితే నోటిఫికేషన్ వచ్చాక చివర్లో రోశయ్యను పొన్నూరు పంపి… గుంటూరు పార్లమెంటు నుంచి మోదుగులను పోటీ చేయించింది.
అప్పుడు రోశయ్య పొన్నూరులో స్వల్ప తేడాతో విజయం సాధిస్తే… మోదుగుల ఎంపీగా పోటీ చేసి గల్లా జయదేవ్ చేతిలో ఓడిపోయారు. ఏదేమైనా గుంటూరు పార్లమెంటు నుంచి వైసీపీ తరపున రోజుల వ్యవధిలోనే కొత్త వాళ్లు తెరమీదకు వస్తుండడంతో వైసీపీ కేడర్లోనూ కన్ఫ్యూజ్ నెలకొంది.