కనుమూరు రఘురామ కృష్ణంరాజు కాకలు తీరిన రాజకీయ యోధుడు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ.. కెవిపి రామచంద్ర రావుకు స్వయానా వియ్యంకుడు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తే ఆయనకు అంత స్థిరత్వం లేదు అనిపిస్తుంది. 2014 ఎన్నికలకు ఏడాది ముందు నరసాపురం వైసిపి పార్లమెంటు ఇన్చార్జిగా నియమితులు అయ్యారు రఘురామ. ఎన్నికలకు ముందు జగన్తో విభేదించి బిజెపిలో చేరారు. అయితే బిజెపి ఆయనకు సీటు ఇవ్వలేదు. బిజెపిలో 2 – 3 యేళ్ల పాటు కొనసాగాక ఆ తర్వాత టిడిపిలోకి జంప్ చేశారు.
మళ్ళీ టిడిపి నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. చంద్రబాబుతో ఎక్కడో తేడా కొట్టింది.. కట్ చేస్తే ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకుని నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఇంత జగన్ ప్రభంజనంలోనూ కేవలం 26 వేల ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఎంపీగా గెలిచిన ఏడాదికే రఘురామా వైసీపీతో విభేదించడం ప్రారంభించారు. చివరకు జగన్తో తీవ్రంగా గొడవ పెట్టుకుని మూడు సంవత్సరాల పాటు నరసాపురం పార్లమెంటు పరిధిలో అడుగు పెట్టలేదు. ఢిల్లీలోనే ఉంటూ రచ్చబండ పేరుతో వైసిపి, జగన్ ప్రభుత్వం పై మాటల తూటాలు పేల్చుతూ వచ్చారు.
బిజెపితో పాటు జనసేన టిడిపితో స్నేహం చేశారు.. తాను నరసాపురం నుంచే పార్లమెంట్ కి పోటీ చేస్తానని చెప్పడంతో పాటు కూటమి తరపున పోటీ చేస్తాను అన్నారే తప్ప అది ఏ పార్టీ అనేది స్పష్టం చేయటం లేదు. తాడేపల్లిగూడెం సభలోను ఇదే విషయాన్ని చెప్పారు. అయితే తాజాగా చూస్తే ఆయన సీటుకు ఎసరు వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా బిజెపి పార్టీలు మారి వచ్చిన వారికి ఎంపీ టిక్కెట్లు ఇవ్వకూడదని ముందు నుంచి బిజెపిలో ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఈ లెక్కను చూస్తే నరసాపురం పార్లమెంటు సీటును బిజెపి తీసుకున్నా అక్కడ రఘురామకు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక బిజెపి కార్యాలయం చుట్టూ రఘురామ పాదాలు అరిగేలా తిరిగినా ఆయనను ఎవరూ చేర్చుకునే కనపడటం లేదు. దీంతో నరసాపురం పార్లమెంటు సీటును టిడిపి నుంచి తీసుకుని పోటీ చేయాలని ఇప్పుడు చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు రఘురామ. చంద్రబాబు ఢిల్లీ వెళితే చాలు అక్కడ వాలిపోతున్నారు.
ఇక జనసేన నుంచి రఘురాంకు పెద్దగా ఆశలు లేవు. ఆ పార్టీ తీసుకున్న రెండు లేదా మూడు ఎంపీ స్థానాలకు గట్టి పోటీ ఉంది. కాకినాడ, అనకాపల్లి, మచిలీపట్నం స్థానాలలో రఘురామ పోటీ చేసే సీన్ లేదు. ఏది ఏమైనా రఘురామను మూడు సంవత్సరాల పాటు తమ స్వలాభం కోసం బాగా ఎంటర్టైన్ చేసిన బిజెపి – జనసేన టిడిపి ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయనకు సీటు ఇవ్వకుండా ముంచేసేలా కనిపిస్తున్నాయి.