అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..వాల్టన్ రీడ్ సైనిక ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడ్డ ట్రంప్ శుక్రవారం నుండి సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ట్రంప్ కరోనా నుండి కోలుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ట్రంప్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి మెరైన్ వన్ హెలికాఫ్టర్ లో వైట్ హౌస్కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను, తన సందేశాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు ట్రంప్.
మహమ్మారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అవ్వడం సంతోషంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. కోవిడ్ గురించి ఎవరూ భయపడొద్దని ఆయన సూచించారు. మన జీవితాలపై వైరస్ అధిపత్యం ప్రదర్శించకుండా చూసుకోవాలన్నారు. కరోనా నియంత్రణకు అవసరమైన మందులు ఆందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ట్రంప్. త్వరలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
కాగా మరో వారం రోజుల పాటు వైట్ హౌస్లోనే వైద్యులు ట్రంప్కు చికిత్స అందించనున్నారు. గత 72 గంటల్లో ట్రంప్ కు జ్వరం రాలేదనీ వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ సియాన్ కాన్లే తెలిపారు. సోమవారం మరో సారి రెమిడెసివిర్ అందించామని చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందనీ, ప్రమాదం నుండి పూర్తిగా బయటపడ్డారని చెప్పలేమన్నారు. అత్యుత్తమ వైద్య నిపుణులు పర్యవేక్షణలో హైట్ హౌస్లోనే చికిత్స కొనసాగుతుందని ఆయన తెలిపారు.
కాగా ట్రంప్ తో పాటు ప్రధమ మహిళ మోలానియా ట్రంప్, ట్రంప్ క్యాంపెయిన్ మేనేజర్ బిల్ స్టెపీన్, ఆయన పర్సనల్ అసిస్టెంట్ నిక్ లూనా, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలిగ్ మెక్నానీ కూడా కరోనా బారిన పడ్డారు.
https://twitter.com/realDonaldTrump/status/1313267143232942081