అమ్మో వేడి చేసేసింది.. అంటూ ఉంటారు చాలామంది. బాగా వేడిచేసిన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ముఖం మాడిపోయి నట్లుగా ఉండి.. అందవికారంగా మారుతుంది. పెదాలు నల్లబడి ఎండిపోయినట్టుగా ఉంటాయి. ఇవే కాకుండా కళ్ళు మంట, కడుపు లో మంట, తలనొప్పి ,అలసట, నీరసం కారణం లేకుండా కోపగించుకోవడం వంటి లక్షణాలు స్పష్టం గా కనిపిస్తాయి. శరీరం నుండి ఈ వేడంతా పోవాలంటే సహజ సిద్ధంగా ఇలా చేసి చూడండి .
అసలు ప్రతి రోజు మంచి నీళ్లు తగినన్ని తీసుకుంటే వేడి చేయడం అనే మాటే ఉండదు.నీరు తాగడం వలన శరీరంలో వేడి తగ్గి.. సమ ఉష్ణోగ్రత ఉంటుంది. ఒంట్లోవేడి చేసినట్లుగా అనిపించినప్పుడు ఉదయాన్నే ఒక గ్లాసుడు నిమ్మరసం పంచదార, లేదా ఉప్పు కలుపుకుని తాగితే ఒంట్లో వేడి తగ్గుతుంది. శరీరం లో వేడిని తగ్గించే విషయం లో ఉల్లి ఎంతగానో పనిచేస్తుంది . ఉల్లిపాయను ఏవిధం గా తీసుకున్నా ఒంట్లో ని వేడిని పూర్తిగా తగ్గిస్తుంది.
మజ్జిగన్నం లో పచ్చి ఉల్లిపాయను నంజుకు తిన్నాకూడా వేడి నుండి ఉపశమనం కలుగుతుంది. వండిన ఉల్లిపాయలకంటే కూడా పచ్చి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. వేడిని తగ్గించుకోవడానికి ఉల్లి రసం కూడా తీసుకోవచ్చు. అయితే… ఇది తాగడం మాత్రం కష్టంగానే ఉంటుంది.
గ్లాసుడు పాలు తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల వెన్న పాలల్లో వేసి కలుపుకొని తాగితే వేడి మాయమవుతుంది.ఒక గ్లాసుడు పాలలో ఒకస్పూన్ తేనె కలుపుకొని తాగిన కూడా శరీరం చల్లబడుతుంది. బార్లీ గింజల జావాలో, మజ్జిగ వేసుకుని పలచగా తాగితే వేడి తగ్గిపోతుంది . శరీరానికి చలవ చేసే గుణం అధికం గా కర్బూజా పండ్లకు ఉంటుంది . కర్బూజా పండు మంద పాటి తోలు తీసేసి, చిన్న ముక్కలుగా తరిగి అందులో పంచదార చల్లుకుని తినడం వలన క్షణాల లో వేడి తగ్గిపోతుంది.