Tuition Master Crime: దేశ వ్యాప్తంగా కఠిన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ.. ఏపీలో దిశా చట్టం తీసుకొచ్చినప్పటికీ మహిళలు/ బాలికలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఆగడం లేదు.. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆడపిల్లల తల్లిదండ్రులకు మనోవేదన కలిగిస్తున్నాయి.. తాజాగా విజయనగరం జిల్లా గంట్యాడ ప్రాంతంలో జరిగిన ఘటన రాష్ట్రంలో పోలీసులు సైతం నిర్ఘాంతపోయేలా చేసింది. ఓ ట్యూషన్ మాస్టర్ తన దగ్గర పాఠాలు నేర్చుకుంటున్న ఓ బాలికను వశపర్చుకుని, గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన పూర్తి వివరాలను పరిశీలిస్తే…
గంట్యాడ ప్రాంతానికి చెందిన ఓ బాలిక పదోతరగతి చదువుతుంది. స్థానికంగా చిన్నా అనే ఒక ట్యూషన్ మాస్టర్ దగ్గర మూడేళ్ళుగా ట్యూషన్ కి వెళ్తుంది. గతేడాది ఆమె పదో తరగతి కావడంతో బాలికకు లెక్కలు, సైన్స్ సరిగా రావడం లేదని.. ప్రత్యేక క్లాసులు అవసరమని ఆ మాస్టర్ కొన్ని రోజులుగా ఆమెను రాత్రి వరకు తన దగ్గరే ఉంచుతున్నాడు. ఈ క్రమంలోనే ఎనిమిది నెలలు కిందట ఆమెను లోబర్చుకున్నాడు. ఎవరూ లేని సమయంలో ఆమెపై అఘాయిత్యం చేసాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే పదో తరగతి ఫెయిల్ చేసేస్తానని, అందరికీ చెప్పి నీ పరువు తీసేస్తానని బెదిరించారు. దీంతో ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. కానీ కొన్ని రోజులుగా నీరసం, తరచూ కళ్ళు తిరిగి పడిపోవడం, పొట్ట కూడా ముందుకు రావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె ఏడో నెల గర్భవతి అని వైద్యులు ధృవీకరించారు. దీంతో షాక్ తిన్న తల్లిదండ్రులు దిశా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసారు. విజయనగరం దిశా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నా బీఈడీ చదివాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తూ ఇంటివద్దనే ట్యూషన్లు చెప్పుకుంటున్నాడు. వివాహితుడే అయినప్పటికీ.. ఈ పాడుపని చేసాడు. ఈ ఘటనతో జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు.