UP Election 2022: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ జరుగుతుంది. యూపిలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తొలి విడతలో 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల నుండి 623 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. తొలి విడతలో మొత్తం 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి దశ బరిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లోని తొమ్మిది మంది మంత్రులు తమ అదృష్టాన్ని మరో సారి పరీక్షించుకోనున్నారు. కేబినెట్ మంత్రులైన శ్రీకాంత్ శర్మ, సురేష్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గర్గ్, ఛౌధురి లక్ష్మీనారాయణ్ తో పాటు మరో ముగ్గురు మంత్రులు తొలి దశ పోలింగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
UP Election 2022: తొలి దశలో ఈ వర్గమే కీలకం
తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. మొత్తం ఏడు దశల్లో యూపి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని 11 జిల్లాల్లో జాట్ సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉన్నాయి. ఈ 58 నియోజకవర్గాల్లో జాట్ సామాజికవర్గ ఓటర్లు అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్ణయించనున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 53 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, ఎస్పీ, బీఎస్పీ రెండు రెండు స్థానాలు, ఆర్ఎల్డీ ఒక స్థానం గెలుచుకున్నాయి. ఈ దఫా ఆర్ఎల్డీ, ఎస్పీ పొత్తుతో రాజకీయ ముఖ చిత్రంపూర్తిగా మారింది.