వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ-జనసేన మిత్రపక్షాల మధ్య పోరు ఉత్కంఠగా మారుతోంది. ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీ ని గద్దె దించాలని మిత్ర పక్షం బలంగానే పోరాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎలా ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో మరింత ఎక్కువగా మిత్రపక్షం బలం కనిపిస్తోంది. దీంతో 2019లో వైసీపీ వచ్చినట్టు ఈ దఫా సీట్లు దక్కే అవకాశం లేదు. గత 2019 ఎన్నికల్లో టీడీపీకి ఎచ్చెర్ల, టెక్కలి(శ్రీకాకుళం), విశాఖలోని నాలుగు తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర నియోజకవర్గాలు దక్కాయి. మిగిలిన అన్ని స్థానాల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది.
ఇక, విజయనగరంలో ఒక్కట కూడా.. టీడీపీ దక్కించుకోలేక పోయింది. అయితే.. ఇప్పుడు ఇక్కడ ఈక్వేష న్లు మారుతున్నాయి. ప్రధానంగా వైసీపీ ని గట్టిగా నిలువరించే ఉద్దేశంతో టీడీపీ-జనసేన మిత్రపక్షాలు ఇక్కడ ఫోకస్ పెంచాయి. పదే పదే.. ఉత్తరాంధ్రలో తిరుగుతున్నాయి. దీంతో వైసీపీకి బలం ఉన్నప్పటికీ.. సీట్ల విషయంలో ఈ దఫా ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదనే సంకేతాలు వచ్చాయి. జిల్లాల వారీగా చూస్తే.. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ కేవలం 18 కే పరిమితం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదేసయమంలో ఎంత నిలువరించినా.. టీడీపీ-జనసేన కూటమి 16 స్థానాలను దక్కించుకునే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఎక్కడెక్కడ ఎలా…
విశాఖ:
ఈ జిల్లాలో 15 సీట్లు ఉన్నాయి. వీటిలో వైసీపీకి ఏడు సీట్లు, టీడీపీ జనసేన కూటమికి ఎనిమిది సీట్లు వస్తాయని లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా విశాఖ సిటీలో దక్షిణం, ఉత్తరం వైసీపీకి మొగ్గు ఉందని అంటున్నారు. వీటితోపాటు.. వైసీపీకి చోడవరం, పాయకరావుపేట, మాడుగులతో పాటు ఏజెన్సీలోని అరకు, పాడేరులలో మొగ్గు కనిపిస్తోంది. ఇక, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు మరోమారు టీడీపీ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. భీమునిపట్నం, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, నర్శీపట్నం, ఎలమంచిలి సీట్లలో టీడీపీ + జనసేన కూటమికి మొగ్గు కనిపిస్తోంది.
శ్రీకాకుళం:
ఈ జిల్లాలో పది సీట్లు ఉన్నాయి. వైసీపీ, టీడీపీ కూటమి చెరో ఐదు స్థానాలను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ ఆధిక్యత ఉన్న సీట్లలో శ్రీకాకుళం, పాలకొండ, రాజాం, నరసన్నపేట, పలాస ఉంటే టీడీపీ కూటమికి టెక్కలి, ఆముదాలవలస, ఇచ్చాపురం, పాతపట్నం, ఎచ్చెర్లలలో మొగ్గు కనిపిస్తోంది. ఏదేమైనా పోటీ మాత్రం హోరా హోరీగా ఉండనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
విజయనగరం:
జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లున్నాయి. 2019లో వైసీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం టీడీపీకి మొగ్గు కనిపిస్తోంది. వైసీపీకి చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ సీట్లు దక్కుతాయని అంచనా ఉంది. అదేసమయంలో టీడీపీ.. బొబ్బిలి, విజయనగరం, శృంగవరపుకోటలలో గెలుపు గుర్రం ఎక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక్కడ బలం పుంజుకోవడానికి జనసేన కారణంగా కనిపిస్తోంది.