వైసీపీకి తాజాగా రాజీనామా చేసిన.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి.. త్వరలోనే టీడీపీ బాట పడతారని అంటున్నారు. దీనికి సంబంధించి.. ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని.. చంద్రబాబు ఆయనను సాదరంగా స్వాగతించేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. ఇక, నెల్లూరు ఎంపీ సీటును కూడా వేమిరెడ్డికి ఇవ్వడం దాదాపు ఖాయమై పోయిందని చెబుతున్నారు. ఇదేసమయంలో ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డికి కూడా.. అసెంబ్లీ టికెట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.
ఇది.. టీడీపీకి ఏమేరకు మేలు చేస్తుందనే విషయం చర్చకు వచ్చింది. సున్నితమైన నెల్లూరులో టీడీపీ పునాదులు బలంగా వేసుకోవాలంటే.. లోకల్గా ఉండి.. పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశాలు ఇస్తే.. రెడ్లు కలిసి వచ్చి.. టీడీపీకి ప్లస్ అవుతారు. కానీ, ఎన్నికలకు ముందు పొరుగు పార్టీలోని రెడ్లను తీసుకో వడం.. పార్టీకి ఇబ్బందిగా మారుతుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వేమిరెడ్డి.. వైసీపీలోనే ఉన్నారు. టీడీపీ జెండా మోయలేదు. ఇప్పుడు ఆయన రాగానే.. పార్టీ కేడర్ ఆయనకు జై కొట్టాలి.
ఈ విషయంలో రెడ్లు ఏమేరకు కలిసి వస్తారనే ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఇక్కడే వైసీపీ మైండ్ బ్లాంక్ అయ్యే రాజకీయాన్ని తెరమీదికి తెచ్చింది. `మన రెడ్డే.. ఎన్ని పదవులు ఇచ్చారు. సీఎం జగన్ ఎంత ప్రేమగా చూసుకున్నాడు. ఆయనకు వెన్ను పోటు పొడిచి.. ఇప్పుడు పార్టీ మారుతున్నాడు. ఇది కరెక్టు కాదు` అని నెల్లూరు రెడ్లు గుసగుసలాడుతున్నారంటే.. వైసీపీ వ్యూహాత్మకంగా రెడ్డి సామాజిక వర్గంలో వేమిరెడ్డిని ఒంటరిని చేసే ప్రయత్నం కళ్లకు కడుతోంది.
ఇది వాస్తవం కూడా.. రాజ్యసభ సీటు ఇచ్చారు. ఆయన సతీమణి. ప్రశాంతి రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ పదవిని కూడా ఇచ్చారు ఇవన్నీ.. పదవులే కదా.. లోక్సభకే వెళ్లాలంటే.. సాధ్యం కాదుకదా! అనే చర్చను వైసీపీ తెరమీదకి తెచ్చింది. దీంతో నిన్న మొన్నటి వరకు సానుకూల పవనాలు ఉన్న వేమిరెడ్డికి మద్దతుగా రెడ్డి వర్గం కూడా.. దూరం అయ్యే పరిస్థితి తెరమీదికి వచ్చింది. ఇలా చూసుకుంటే.. టీడీపీకి ఆయన వల్ల ప్రయోజనం ఉన్నా లేకున్నా.. వ్యక్తిగతంగా ఒంటరి అయ్యే నాయకుడితో సాధించేది ఏముంటుందో చూడాలి.