ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. అయితే.. ఆయన జాడ మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పాత్ర నామమాత్రంగానే ఉండిపోయింది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ ఆయన జాడ కనిపించడం లేదు.దీంతో ఆయన అసలు రాజకీయాల్లో ఉన్నారా? లేరా? అనే సందేహాలు ముసురుకున్నాయి. మరోవైపు.. ఆయన టీడీపీలో చేరతారనే చర్చ సాగుతోంది. ఇదే జరిగితే సంచలనమేనని అంటున్నారు. ఆయన తమ్ముడు కిశోర్ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు.
గతం ఉన్నతం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ పెట్టుకున్నారు. కొన్నాళ్లకు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అక్కడ ఉండలేక కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కానీ ఆయన గత రెండేళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ లో కనిపించడం లేదు. తెలంగాణ ఎన్నికల సమయంలో సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఉపయోగపడతారని బీజేపీ అంచనా వేసింది. కొన్ని సమావేశాల్లో కనిపించారు. కానీ, అంత యాక్టివ్గా మాత్రం ఆకర్షించలేదు.
ఇక కాంగ్రెస్ లో కొన్నేళ్లు పాటు ఉన్నా సైలెంట్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత యాక్టివ్ అవుతారని భావించారు. అయితే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడంతో ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలకు బాగా పనికొస్తాడని పార్టీలో చేర్చుకున్నారు. పైగా మాజీ ముఖ్యమంత్రి కావడంతో ప్లస్ పాయింట్ అయింది. ఆయన పార్టీలో చేరితే రెడ్డి సామాజికవర్గం ఓటర్లు కమలం వైపు చూస్తారని భావించారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి వల్ల బీజేపీకి ఎలాంటి మేలు జరగలేదన్న వాదన వినపిస్తోంది.
దాంతో ఆయన రాజకీయాల్లో కనిపించడం మానేశారు. ఏపీ బీజేపీ కార్యక్రమాల్లో అసలు పాల్గొనడం లేదు. పార్టీలో చేరినప్పు డు ఏపీకి వచ్చిన ఆయన ఒక మీడియా సమావేశం పెట్టి కనిపించి వెళ్లిపోయారు. తర్వాత బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి బాధ్యతలను చేపట్టే సమయంలో కనిపించారు. ఇక అంతే ఆయన అడ్రస్ లేదు. హైదరాబాద్ లోనే ఉంటున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడా, అక్కాడ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఏపీలో పొత్తుల చర్చలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో కీలక స్థానాల్లో తాము పోటీ చేస్తామంటూ కొంత మంది ముందుకు వస్తున్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి పేరు మాత్రం అసలు ప్రచారంలోకి రావడం లేదు. ఇదిలావుంటే, ఆయనను టీడీపీలోకి తీసుకువచ్చేందుకు ఆయన సోదరు ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కిరణ్ను ఒప్పించి..టీడీపీలోకి తీసుకురాగలిగితే.. చిత్తూరు, నెల్లూరు ప్రకాశం జిల్లాలోని రెడ్లంతా.. సైకిల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.