Visakha Steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్త బంద్ కు కార్మికులు పిలుపునిచ్చారు. నేడు రాష్ట్ర బంద్ కు కార్మికులు పిలుపునిచ్చారు. బంద్ కు ప్రభుత్వం కూడా సంఘీభావం తెలియడంతో బస్సులు ఆర్ టీ సీ బస్టాండ్ కే పరిమితం అయ్యాయి. మధ్యాహ్నం వరకూ ఆర్ టీ సీ బస్సులు తిరవగవని మంత్రి పేర్ని నాని ఇప్పటికే తెలియజేశారు. ఏపి బంద్ కు టీడీపీ, వైసీపీతో పాటు వామపక్షాలు, విద్యార్థి, కార్మిక, మహిళా, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. పోరాట సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వ విద్యాలయాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూసివేశారు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద, జిల్లా కేంద్రాలలో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నిరసనలు తెలియజేస్తున్నారు. నిరసన కార్యక్రమాల్లో వివిధ రాజకీయ పక్షాల నేతలు, వామపక్షాలు నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ మాట్లాడుతున్నారు. కేంద్రం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గే వరకూ పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్త బంద్ సందర్భంగా వివిధ ప్రాంతాలకు అత్యవసరాల మీద వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంద్ ను పురస్కరించుకుని పలువురు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి తమ సంఘీభావం తెలియజేయనున్నారు.