ప్రముఖ సినీనటి భానుప్రియ ఇంట్లో ముగ్గురు మైనర్ బాలికలు ఉన్నట్లు బాలల హక్కుల పరిరక్షణ సంఘం నాయకుడు అచ్చుతరావు ఆరోపించారు. బాలికల అక్రమ రవాణా, బాల కార్మిక చట్టం ఉల్లంఘన కింద భానుప్రియపై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల జాతీయ కమిషన్కు, రాష్ట్ర కమిషన్కు ఆయన లేఖలు రాశారు.
తన మైనర్ కుమార్తెను సినీనటి భానుప్రియ ఇంటి పనికి పెట్టుకుని వేధింపులకు గురి చేస్తుందని, తన కుమార్తెను చూడటానికి కూడా అవకాశం కల్పించడం లేదని సామర్లకోటకు చెందిన మహిళ ఫిర్యాదు చేసింది. చైల్డ్ లేబర్ ఆఫీసర్ ఆ మహిళతో కలిసి చైన్నైలోని సినీనటి భానుప్రియ ఇంటికి వెళ్లి పరిశీలన చేశారు. భానుప్రియ ఇంట్లో మైనర్ బాలికలను పనిలో ఉంచుకోవడంతో పాటు లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సామర్లకోట పోలీస్ స్టేషన్లో మైనర్ బాలిక తల్లి పిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపితే బాలికల అక్రమ రవాణా రాకెట్ గుట్టురట్టు అవుతుందని అచ్చుతరావు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాలిక తల్లి ఆరోపణలను సినీనటి భానుప్రియ ఖండించారు. తన ఇంట్లో చోరీ చేసిన విషయం బయటపడుతుందని భయపడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లో తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని భానుప్రియ చెబుతున్నారు.
చోరీ చేసిన ఐపాడ్, కెమెరా, వాచ్లు మాత్రమే బాలిక తల్లి తెచ్చి ఇచ్చిందని, మిగిలిన బంగారు వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పి వెళ్లి తనపై ఫిర్యాదు చేసిందని అన్నారు.
వస్తువుల చోరీపై టి నగర్ పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిపై భానుప్రియ ఫిర్యాదు చేసింది.
నెలకు పది వేలు జీతం ఇస్తామన్న భానుప్రియ 18 నెలలుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బాలిక తల్లి చెబుతోంది.
తన కుమార్తె వేధింపులపై తనకు ఫోన్ చేయగా జనవరి 18వ తదీన భానుప్రియ ఇంటికి వెళ్లానని, తన కుమార్తెను కలిసేందుకు అవకాశం కల్పించలేదన బాలిక తల్లి ఆరోపించింది.
భానుప్రియ, అమె సోదరుడిపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.