విజయవాడ: ఆర్టిసిని తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసిపి నేత పార్థసారధి విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్టిసి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టిసిని కొట్టేసేందుకు చంద్రబాబు, ఆయన అనుయాయులు ప్రయత్నిస్తున్నారని పార్థసారధి ఆరోపించారు.
సంస్థను కాపాడుకోవడానికి 60వేల మంది ఉద్యోగులు, కార్మికులు చిత్తశుద్ధితో కష్టపడుతున్నారని పార్థసారధి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆర్టిసి కార్మికులు,వారి కుటుంబాలు ఆందోళనతో ఉన్నాయని పార్థసారధి పేర్కొన్నారు.
ఆర్టిసి నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు ఆలోచన ధోరణి ఉందని పార్థసారధి విమర్శించారు. చంద్రబాబుకు,వారి తాబేదారులకూ హాయ్ల్యాండ్ భూముల మీద మక్కువ ఉందని పార్థసారధి ఆరోపించారు.
ఇప్పుడు వారి కన్ను ఆర్టిసీపై కూడా పడిందని పార్థసారధి అన్నారు. ఆర్టిసిని నష్టాల నుంచి కాపాడేందుకు చంద్రబాబు ఒక్క చర్య కూడా తీసుకోలేదని పార్థసారధి విమర్శించారు.
దేశంలో ఎక్కడా లేనంతగా డీజిల్పై ఆంధ్రప్రదేశ్లో భారీగా పన్నులు వేస్తున్నారని పార్థసారధి ఆరోపించారు.
వేల సంఖ్యలో ఆర్టిసి బస్సులను పోలవరం సందర్శన, నవనిర్మాణ దీక్షలు,ధర్మపోరాట దీక్షలకు,డ్వాక్రా మహిళా సమావేశాలకు చంద్రబాబు తిప్పారనీ, టిడిపి కార్యక్రమాల కోసం చంద్రబాబు ఆర్టిసిని వాడుకున్నారని పార్థసారధి ఆరోపించారు. నేడు వందల కోట్లు ఆర్టిసికి ప్రభుత్వం అప్పు చెల్లించాల్సి ఉందని పార్థసారధి అన్నారు.
ఆర్టిసి నష్టాల బారి నుంచి బయటకు రావాలంటే జగన్ వల్లే సాధ్యమని స్పష్టం చేస్తూ, జగన్ అధికారంలోకి రాగానే ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తారని పార్థసారధి పేర్కొన్నారు.