హైదరాబాద్: తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలపై న్యాయపోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. శనివారం గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షడు ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన సీనియర్ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా హజరైయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్సీ ఎన్నికలు తదితర విషయాలపై చర్చించారు.
ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఎంపిటిసి, జడ్పిటిసి ఓటర్ల జబితాలో స్పష్టత లేదని ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు.
ప్రజలను రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ తప్పుదోవపట్టిస్తురని ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు.
ఒక వైపు న్యాయపోరాటం చేస్తూనే మరో వైపు బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి)లకు అప్పగిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కాగా సమావేశం జరుగుతున్న సమయంలో మాజీ ఎంపి వి హనుమంతరావు పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మధ్యలోనే వెళ్లిపోయారు. పార్టీలో ఉన్న వారికి విలువలేకుండా చేసి బయటవాటిని తెచ్చి పెద్దరికం అప్పగించారనీ, అటువంటి వారిని నమ్ముకుని ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న వారికి ఏం సమాచారం ఇవ్వాలనుకున్నారని విహెచ్ ప్రశ్నించారు.
‘ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారని తెలిసి కూడా వారిని పిలిచి మాట్లాడలేకపోయారు. తీరా ఇప్పుడు వెళ్లిపోయిన తరువాత పిలిచి ఏం మాట్లాడతారు’ అని విహెచ్ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఒక్కరే ఏమి సాధిస్తారనీ, పార్టీ కోసం మేమంతా లేమనుకున్నారా అంటూ విహెచ్ హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మధ్యలోనే వెళ్లిపోయారు.
సమావేశంలో షబ్బీర్ అలీ, కొండా విశ్వేశ్వర్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు కూడా పాల్గొన్నారు.