Congress: ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఎపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధులను పార్టీ దాదాపు ఖరారు చేసింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో ఈ మేరకు అభ్యర్ధుల జాబితాకు తుది రూపు తీసుకొచ్చినట్లు సమాచారం. సీఈసీ సమావేశానికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తో పాటు ముఖ్యనేతలు హజరైయ్యారు. 117 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులుగా పలువురి పేర్లను ఆ పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు తెలుస్తొంది. 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాల అభ్యర్ధులను పెండింగ్ లో ఉంచినట్లు సమాచారం.
కడప లోక్ సభ స్థానం నుండి వైఎస్ షర్మిల పోటీ చేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. అలానే రాజమహేంద్రవరం నుండి గిడుగు రుద్ర రాజు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. వీరితో పాటు విశాఖ లోక్ సభ స్థానం నుండి సత్యారెడ్డి, కాకినాడ నుండి పల్లంరాజు, బాపట్ల నుండి జేడీ శీలం, ఏలూరు నుండి లావన్య, రాజంపేట నుండి నజీర్ అహ్మద్, చిత్తూరు నుండి చిట్టిబాబు, హిందూపురం నుండి షాహీన్ అభ్యర్ధిత్వాలు ఖరారైనట్లు తెలిసింది.
నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్ సభ స్థానాలను పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రి, సీనియర్ నేత రఘువీరారెడ్డి ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.
కడప లోక్ సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీఎం జగన్ ప్రకటించారు. జగన్ సోదరి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలుస్తున్నారు. దీంతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికే చెందిన ఇద్దరు (అన్న చెల్లెలు) కడప లోక్ సభ బరిలో ప్రత్యర్ధులుగా నిలుస్తుండటంతో పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
CM YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు