YSRCP: ఈ నెల 27వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ అభ్యర్ధులు నామినేషన్ లు వేశారు. ఈ రోజు అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ అభ్యర్ధులుగా వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి, గొల్ల బాబూరావులు తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
సోమవారం అసెంబ్లీ లో రాజ్యసభ ఎంపీ అభ్యర్ధుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన సంయుక్త కార్యదర్శి యం విజయరాజు వద్ద వారి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్ధుల వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 15వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. తొలుత వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. వీరికి సీఎం జగన్ బీఫాం లు అందజేశారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైసీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని కొనియాడారు. గతంలో బీసీలకు నలుగురికి రాజ్యసభ అవకాశం కల్పించగా, తాజాగా దళితుడైన గొల్ల బాబూరావుకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.
శాసనసభలో అత్యధిక బలం తమకే ఉందని, వైసీపీ నుండి ముగ్గురు అభ్యర్ధులం విజయం సాధిస్తామని వైవీ అన్నారు. సీఎం జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారనీ, మళ్లీ వైఎస్ జగన్ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరో అభ్యర్ధి మేడా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ తనకు అవకాశం కల్పించారనీ, జగన్ ఆశయాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తానని పేర్కొన్నారు.
గొల్ల బాబూరావు మాట్లాడుతూ..జగన్ చరిత్ర సృష్టించారని అన్నారు. పేద వర్గాల వారికి రాజ్యసభకి పంపిస్తున్నారన్నారు. కొట్లు ఇచ్చిన దొరకని రాజ్యసభ స్థానాన్ని దళితుడైన తనకు ఇచ్చారన అన్నారు. గతంలో చంద్రబాబు తన కులానికి చెందిన కనకమేడల కోసం దళితుడైన వర్ల రామయ్యను అవమానించారని విమర్శించారు. సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు తామే దక్కించుకుంటామని తెలిపారు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ స్పీచ్ హైలెట్