కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, బిజెపికి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లతో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. నిమ్మగడ్డ వారిని కలవడంపై వైకాపా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వారి రహస్య భేటీ వెనుక కుట్ర కోణం దాగి ఉందని వైసీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. రెండు మూడు రోజులుగా వైకాపా నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలిని తీవ్రంగా విమర్శించడం చూస్తున్నాం.
అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మరో కీలక కోణం దాగి వుందని అంటున్నారు. వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుతం ఎస్ఈసీ పదవిలో లేరు. అయన రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి కింద లెక్క. ఆయన ఇప్పుడు ఎవరిని కలిసినా ప్రభుత్వానికి, ప్రజలకు వచ్చే నష్టము లేదు, లాభము లేదు. అయినా ఆ విషయం తీవ్ర రచ్చ చేయడానికి వేరొక కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. అది ఏమిటంటే..వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై ఇటీవల 108 అంబులెన్సుల నిర్వహణ కాంట్రాక్ట్ విషయంలో ఆరోపణలు వచ్చాయి. 108 అంబులెన్సులకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టు రద్దు చేసి మరీ విజయసాయి రెడ్డి వియ్యంకుడికి చెందిన కంపెనీకి అప్పగించారని,రివర్స్ టెండరింగ్ కు వెళ్లకుండా సదరు కంపెనీకి వాహనాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారని దీనిలో దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. విజయసాయి రెడ్డి తన అల్లుడికి మేలు చేసేందుకే అరబిందో సంస్థ కు 108 అంబులెన్సుల నిర్వహణ బాధ్యత అప్పగించారని వారు అంటున్నారు.
టీడీపీ ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేయడంతో విజయసాయి రెడ్డి పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారిందంటున్నారు. దీనిపై అయన ఏమి మాట్లాడలేక పోతున్నారని, అందుకే మీడియా దృష్టి మళ్లించేందుకు వేసిన మాస్టర్ స్కెచ్ లో భాగం అని రాజకీయ వర్గాలలో టాక్. విజయసాయి రెడ్డి సన్నిహితుడైన సుబ్బిరామిరెడ్డి సహకారంతో ఈ స్కెచ్ వేశారంటున్నారు. త్వరలో ఇలాంటి వ్యూహాలు మరెన్నో చూడవచ్చని చెప్పుకొంటున్నారు.
విజయసాయి రెడ్డిపై విశాఖలో భూఅక్రమణ ఆరోపణలు కూడా ఉన్నాయని, అవి కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.