విజయనగరం, డిసెంబర్ 30: దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ సర్వీసులో ఉన్నతాధికారిగా పని చేసిన అజయ్ కలాం పదవీ విరమణ అయిన తరువాత రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో విపరీతమైన అవినీతి జరుగుతోందంటూ వరస విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, స్కీమ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదననీ, ఎమ్మెల్యే మొదలుకొని ముఖ్యమంత్రి వరకూ పర్సంటేజ్లు ముడతున్నాయననీ రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజం కల్లం అన్నారు.
విజయనగరంలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు అంజయ్య హయాంలో శంకుస్థాపన జరగ్గా, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కాలువల నిర్మాణం జరిగందన్నారు. ఆ తరువాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ కాలువలకు రెండు సెకండ్ హ్యాండ్ మోటార్లు బిగించి ఏవో తంటాలు పడుతున్నారని అన్నారు. పట్టిసీమలో 600 కోట్ల రూపాయల పనులు జరిగితే 1600 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారనీ, కాగ్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్నారు. టెండర్లు పిలిచేదీ చీఫ్ ఇంజనీర్లు, పనులు చేయించేది ఇంజనీర్లు అయితే ఈ నాయకులు అంతా తాము చేశామంటూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తుంటారన్నారు. ఏ ప్రాజెక్టు గానీ స్కీమ్లలో గానీ ప్రజా ప్రతినిధులకు ఆరు శాతం నుంచి ఎనిమిది శాతం కమీషన్ల కోసం ఎస్టిమేట్లను పెంచుకుంటున్నారని అన్నారు. పెద్ద కాంట్రాక్ట్ సంస్థలు పనులు చేయకుండా చిన్న చిన్న కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్ట్ ఇస్తుంటాయననీ, వీరు ఎమ్మెల్యే మొదలుకొని అధికారులకు అందరికీ పర్సంటేజీలు ఇస్తుంటారననీ అన్నారు. పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన అజయ్ కల్లం సినిమా హీరోలు సమాజానికి హీరోలు కాదని, జీవితాలు త్యాగం చేసేన వారు హీరోలు అవుతారని అన్నారు.