Amit Shah: అమిత్ షా Amit Shah బెంగాల్లో ఎన్నికల ప్రచారం అంతా ఒక యుద్ధంలా జరుగుతోంది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలు, వాగ్భాణాలతో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. 200 పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు. బెంగాల్ గద్దె పైనుంచి మమతను ప్రజలు దింపేయడం ఖాయమని అంటున్నారు.
బెంగాల్ బిడ్డనే ప్రజలు ఆదరిస్తారని సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. ప్రమాదంలో కాలిగి గాయమైనా కూడా కట్టు కట్టుకుని మరీ వీల్ చైర్ పైనుంచే ప్రచారం చేస్తున్నారు దీదీ. ప్రజల్లో సానుభూతి కంటే ఆమె పట్టుదలే ఇక్కడ ఎక్కవ కనిపిస్తోంది. బీజేపీ అగ్ర నాయకత్వం మొత్తం బెంగాల్ లో పాగా వేశారు. అయితే..
బీజేపీ ముఖ్య నాయకుడు అమిత్ షా ఇప్పటికే రెండుసార్లు బెంగాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానికులతో కూడా మమేమకమయ్యారు. తన మలి పర్యటనలో భాగంగా అమిత్ షా బెంగాల్లోని ఝాడ్ గ్రామ్ లో జరిగే ర్యాలీకి రావాల్సి ఉంది. అసోంలో ప్రచారం ముగించుకుని ఇక్కడకు రావాల్సి ఉన్నా ఆయన రాలేదు. వర్చువల్ మీటింగ్ ద్వారా ఎన్నికల ప్రసంగం చేశారు. హెలికాఫ్టర్ పాడవడంతో రాలేకపోయారని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే.. టీఎంసీ నాయకులు మాత్రం అమిత్ షా సభకు జనాలు రాకపోవడమే ఆయన రాకపోవడానికి కారణమంటున్నారు.
నిఘా వర్గాలు, బీజేపీ శ్రేణులు ఇచ్చిన సమాచారం మేరకే ఆయన పర్యటన రద్దు చేసుకున్నారని.. జనాలు లేని ర్యలీకి రాలేకే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే బీజేపీకి ఇది ఎదురుదెబ్బ కిందే లెక్క. కేంద్ర హోంమంత్రి హోదాలో అమిత్ షా తలచుకుంటే వేరే ప్రేవేట్ విమానంలో కూడా రాగలరని అంటున్నారు. టీఎంసీ వ్యాఖ్యల్లో నిజమైతే బీజేపీకి బెంగాల్లో ఎదురుగాలి వీస్తోందనే చెప్పాలి. మరోవైపు మమతా బెనర్జీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న పీకే కూడా.. ఎన్నికల్లో తృణమూల్ ఓడిపోతే మళ్లీ ఎన్నికల వ్యూహకర్తగా చేయనని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా పర్యటన క్యాన్సిల్ కావడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది.