AP Politics: ఏపీలో రాజకీయాలు వివాదాలకు, అంశాలకు కొదవ లేదు..! అధికార పార్టీ స్వీయ తప్పులు.., ప్రతిపక్ష పనికిమాలిన పోరాటాలు.., జనసేనాని సుత్తి సినీ మాటలు.. బీజేపీ డాబులు.. వెరసి ఏపీ రాజకీయ తెరపై నిత్యం ఏదో ఒక అంశం ఫామ్ లోనే ఉంటుంది.. బోరింగ్ అంటూ ఉండదు..! ఇటువంటి ఏపీ అంశాలు మరింత మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లోకి కేంద్ర పార్టీలు మరింత లోతుగా వేలు, తల, చేయి, కాలు అన్నీ పెట్టేసి సూచనలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే ఏపి రాజకీయ పరిణామాలకు సంబంధించిన వివాదాలు ఢిల్లీ స్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఏపి రాజకీయాలను ఢిల్లీ స్థాయి నుండి శాసించే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
AP Politics: పీకే ఒక తరహా స్కెచ్..!?
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే గురించి దేశ రాజకీయాల్లో తెలియని వారు లేరు. ఆయనకు ఏపి జగన్మోహనరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఏపిలో వైసీపీ అధికారంలోకి రావడానికి పీకే వ్యూహాలు కారణమని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రతిపక్షాల కూటమితో కాంగ్రెస్ పార్టీని గద్దె నెక్కించాలని కంకణం కట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పలు మార్లు భేటీ కావడం, ఆ తరువాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో బేటీ అయ్యారని కూడా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ గెలుపునకు, తమిళనాడులో స్టాలిన్ పార్టీ గెలుపునకు పని చేసిన పీకే.. ఇక కేంద్రంలో చక్రం తిప్పడానికి సిద్దమయ్యారని సమాచారం. మోడీని అధికారంలో నుండి దింపాలన్న ఏకైక లక్ష్యంతో పీకే బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటినీ కాంగ్రెస్ గూటి కిందకు చేర్చడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సోనియా నాయకత్వాన్ని విభేదించి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చినప్పటికీ కాంగ్రెస్ కు దగ్గర చేయాలన్న భావనతో పీకే ఉన్నారనీ, వైసీపీతో అలయెన్స్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే సోనియా సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ ఆవిర్భావానికి ముందు షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి సోనియా గాంధీ ఆహ్వానించారని కూడా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆ ప్రతిపాదనను షర్మిల తోసిపుచ్చినట్లు సమాచారం.
ప్రభుత్వ పరంగా ఇబ్బందులు, కోర్టు వివాదాలు, కోర్టు కేసులు తదితరాల నేపథ్యంలో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీని ఎగర్తించే పరిస్థితి లేదనీ, అయితే పార్లమెంట్ ఎన్నికలకు ఆరు నెలల ముందు పీకే చెప్పినట్లు నడుచుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఇటువంటి నిర్ణయాల్లో తొందర పడరు.. ఆచితూచి నిర్ణయాలు తీసుకునేరకం..!
బీజేపీ రాజకీయం మొదలు..!!
బీజేపీ హాండ్స్ నుండి జగన్ జారిపోకుండా ఉండేందుకే వ్యూహత్మకంగా కేంద్ర అధిష్టానం వ్యవహరిస్తుందని సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల ఆర్ఎస్ఎస్ కు చెందిన పత్రికలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వ విధానాలను విమర్శించడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న మతమార్పిడులపైనా ఘాటుగా వ్యాసాన్ని ప్రచురించింది. దీనికి తోడు వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న డీఐజీ స్థాయి అధికారిని ఆకస్మికంగా తప్పించి ఎస్పీ స్థాయి అధికారిని నియమించడం, కేసును వేగవంతం చేయడం లాంటి చర్యలు ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కేంద్ర గేమ్ ప్లానేనంటున్నారు. జగన్ ఒకవేళ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తే వెంటనే బీజేపీ ఏపీలో తమ రెండో రాజకీయ వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉందని.. అందుకే ఇప్పటి నుండి జగన్ వ్యతిరేక విధానాలకు సాన పడుతుందని ఢిల్లీ స్థాయిలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..!!