పాట్నా: బిజెపి అసమ్మతి నేత, ఎంపి శతృఘ్న సిన్హాను అధిష్టానం ఈ సారి పక్కన పెట్టింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్నా సాహిబ్ లోక్ సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు అవకాశమిచ్చింది. రవిశంకర్ ప్రసాద్ ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.
బీహార్లో లోక్సభ అభ్యర్థుల జాబితాను ఎన్డిఏ శనివారం విడుదల చేసింది. బిహార్లో మొత్తం 40 లోక్సభ నియోజకవర్గాలుండగా 39 స్థానాల్లో ఎన్డిఏ అభ్యర్థులను ఖరారు చేశారు. పొత్తులో భాగంగా బిజెపి, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడియు చెరో 17 స్థానాల్లో పోటీ చేస్తుండగా మిగతా ఆరు సీట్లను లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపి)కి కేటాయించారు.
2009 , 2014 ఎన్నికల్లో పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి శతృఘ్న సిన్హా బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1996 నుంచి 2008 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. వాజ్ పేయ్ హయాంలో కొంత కాలం కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు.
గత కొన్నేళ్లుగా శతృఘ్న సిన్హా పార్టీపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ప్రధాని మోది, పార్టీ నాయకత్వంపై విమర్శలు కూడా చేశారు. ఈ సంవత్సరం మొదలులో అనగా జనవరిలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఏర్పాటుచేసిన ఐక్యతా ర్యాలీకి కూడా ఆయన హాజరయ్యారు.
దీంతో శతృఘ్న సిన్హా పార్టీని వీడుతున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై ఆయన అధికారికంగా స్పందించలేదు. వచ్చే ఎన్నికల్లో తాను తిరిగి పాట్నా సాహిబ్ నుంచే పోటీ చేస్తానని శతృఘ్న సిన్హా ప్రకటించారు. కానీ బిజెపి ఆ స్థానంలో రవిశంకర్ ప్రసాద్ను బరిలోకి దింపింది.
శతృఘ్న సిన్హా బిజెపిని వీడి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని సమాచారం.