(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడు రాజధానుల ప్రతిపాదన చేయడం, దీనికి గవర్నర్ ఆమోద ముద్ర వేయడం తెలిసిందే. మూడు రాజధానుల విషయంలో కేంద్రం వైఖరి ఏమిటి అన్న విషయానికి వస్తే కేంద్రం దీనిపై స్పష్టంగానే ఉన్నది. రాజధానుల విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కేంద్రం స్పష్టం చేసింది కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే రాజధానులుగా నిర్ణయిస్తుందో వాటి అభివృద్ధికి నిధులు ఇస్తామని తెలిపింది. విభజన చట్టంలో కూడ రాజధానికి కేంద్రం నిధులు అనే ఉంది తప్ప రాష్ట్ర రాజధానిని కేంద్రం ఏర్పాటు చేస్తుంది అని ఎక్కడా లేదని పేర్కొన్నది. ఈ మేరకు ముచ్చటగా మూడు సార్లు కేంద్రం ఏపి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ కుండ బద్దలు కొట్టింది. దీనితో కేంద్రం నుండి క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిర్ణయించిన మూడు రాజధానులకు కేంద్రం నుండి ఏటువంటి చిక్కులు లేవని అర్థం అవుతోంది.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే .. కేంద్రం చెప్పిన దానిలో కూడా ఒ చిన్న మెలిక ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చెబుతుంది ఏమిటంటే పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయరాజధానిగా కర్నూలు అని. అంటే శాసన రాజధాని అమరావతిలో శాసనసభ, శాసన మండలి భవనాలు ఉంటాయి. శాసన కార్యకలాపాలు ఇక్కడ నుండే నిర్వహిస్తారు. అదే విధంగా పరిపాలనా రాజధని అంటే విశాఖలో సచివాలయం, వివిధ శాఖల హెచ్ఒడి కార్యాలయాలు, ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంప్ ఆఫీసు, రాజ్ భవన్ ఇలా ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలు అన్నీ అక్కడ నుండి నిర్వహిస్తారు. న్యాయరాజధాని అంటే కర్నూలులో హైకోర్టు భవనం, న్యాయమూర్తుల నివాస గృహాలు ఏర్పాటు చేసి హైకోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తారు. అయితే కేంద్ర హోంశాఖ హైకోర్టులో వేసిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది ఏమిటంటే హైకోర్టు ఉన్నంత మాత్రాన అది రాజధాని అంటే న్యాయరాజధాని కాదు అని పేర్కొన్నది. అంటే ఒక వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన అది న్యాయరాజధానిగా పరిగణించే అవకాశం లేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటిస్తున్నది, గవర్నర్ ఆమోదించిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుల్లో ఉన్నది కర్నూలు న్యాయరాజధాని అని. ఇప్పుడు సిఎం జగన్ మూడు రాజధానులుగా ఏలా సమర్థించుకుంటారు అనేది ఇప్పుడు ఉత్పన్నం అవుతున్న ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు తమకు ఎటువంటి సంబంధం లేదు అంటూనే న్యాయరాజధాని విషయంలో చిన్న మెలిక పెట్టింది. న్యాయరాజధాని విషయంలో ఇదొక్కటే కాకుండా న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. అమరావతిలో ఉన్న హైకోర్టును ఇప్పుడు కర్నూలుకు తరలించాలంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల అంగీకారం కావాలి, సుప్రీం కోర్టు అనుమతి తీసుకోవాలి ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి. దీనికి ఇంత తతంగం ఉంటుంది. ఈ వేమీ లేకుండా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల అనుమతి లేకుండా హైకోర్టును తరలిస్తామంటే కుదిరే పని కాదు. ఒక వేళ న్యాయపరమైన చిక్కులు పరిష్కరించుకుని అందరి ఆమోదంతో హైకోర్టును కర్నూలుకు తరలించినా కూడా దాన్ని న్యాయరాజధానిగా గుర్తించే అవకాశం లేకపోవడంతో జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానులు ఏలా అవుతాయి. దీంతో రాష్ట్రానికి రెండు రాజధానులే విశాఖ పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధానిగా చెప్పుకోవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో హైకోర్టు ఉన్నంత మాత్రాన రాజధాని కాదని స్పష్టం చేసినందున సీఎం జగన్మోహనరెడ్డి దీనిపై ఏ విధంగా స్పందిస్తారు, కర్నూలును న్యాయ రాజధానిగా సమర్థించుకునేందుకు తీసుకోనున్న చర్యలు ఏమిటి అన్నది ఇప్పుడు ఆశక్తికరంగానూ, చర్చనీయాంశంగానూ మారుతోంది.