ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అంతర్వేది రథం దగ్ధం ఘటన ఎంతటి సంచలనం రేపుతుందో తెలిసిన విషయమే. భక్తుల దగ్గర నుంచి హైందవ సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ ఈ అంశంపై తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఘటనపై నిగ్గు తేల్చాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఈ సెగ ఏపీ ప్రభుత్వాన్ని తాకింది. దీంతో ప్రభుత్వం స్పందించింది. అధికారుల సస్పెన్షన్, దేవాదాయ శాఖతో ఇన్వెస్టిగేషన్, కొత్త రధానికి నిధులు.. ఇలా సీరియస్ గానే స్పందించింది. అయితే.. రాజకీయంగా మలుపులు తీసుకుంటున్న ఈ అంశంపై ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని ఏకంగా సీబీఐ ఎంక్వైరీ చేయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన జీవో కూడా విడుదలైంది. ఈ అంశంపై మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు.
హర్షకుమార్ ఏమన్నారంటే..
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రాజకీయ పార్టీలు స్వలాభం కోసమే విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. అంతర్వేది రాజోలు నియోజకవర్గంలో ఉందని.. అక్కడ జనసేన రెబల్ ఎమ్మెల్యే ఉండటం వల్లే జనసేన, బీజేపీలు దీనిని రాజకీయం చేస్తున్నాయని విమర్శలు చేశారు. కాపుల్లో బలపడాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ ను రంగంలోకి దించి నియోజవర్గంలో కాపుల్ని రెచ్చగొడుతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రస్తత అంశాన్ని అవకాశంగా తీసుకుని మతం మీద అభిమానంతో బీజేపీ.. కులం అభిమానంతో జనసేన వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు. కులాభిమానం ఎక్కువగా ఉన్న సోము వీర్రాజుకి చిరంజీవిని సీఎం చేయాలనే లక్ష్యంతో ఉన్నారని అన్నారు. చిరంజీవి కుటుంబానికి సోము వీర్రాజు హనుమంతుడిలా మారారంటూ ఎద్దేవా చేశారు.
కులానికో రకంగా వ్యవహరిస్తున్నారు..
ఇదే జిల్లాలో దళిత యువకుడికి శిరోముండనం చేయిస్తే ప్రభుత్వం సీబీఐతో విచారణ ఎందుకు చేయించట్లేదని ప్రశ్నించారు. కులాన్ని బట్టి సీఎం జగన్ తీరు ఉంటోందని మండిపడ్డారు. సీతానగరం శిరోముండనం ఘటనపై కూడా సీబీఐ విచారణ జరిపించి సీఎం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. హర్షకుమార్ వ్యాఖ్యలతో రథం దగ్ధం అంశం రాజకీయంగా మరో మలుపు తీసుకుంటుందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. రథం అంశాన్ని తీసుకుని కులం, రాజకీయం, శిరోముండనం ఘటనను తెర మీదకు తీసుకొచ్చారు. సీఎంను ఇరుకున పెట్టేలా ఉన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ పార్టీలన్నింటినీ దూనమాడిన హర్షకుమార్ టీడీపీపై మాత్రం ఎటువంటి విమర్శలు చేయలేదు.