టిడిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అమరావతి రాజధానిపై ఒక రకంగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. కరోనా కాలమో, మీడియా సహకారం లేకనో ప్రజల్లో అంతగా ఆసక్తి లేకనో రాజధానిపై టిడిపి పోరాటం చెప్పగానే సాగుతోంది. మీడియా ముందు మాటలకు, సోషల్ మీడియాలో వీడియోలకు తప్ప ఇంకెక్కడ ఆ పోరాటం ప్రభావం కనిపించడం లేదు. కేవలం చంద్రబాబు, అయన తనయుడు లోకేష్, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, అప్పుడప్పుడు కేశినేని నాని, నిమ్మకాయల చినరాజప్ప, కళావెంకట్రావు, దేవినేని ఉమా మహేశ్వరరావు వంటి వారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు రాజధాని పైన మాట్లాడటం లేదు. జగన్ నిర్ణయాలను గట్టిగా విమర్శించడం లేదు. అసలు తెలుగుదేశం పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఏమైపోయారో ఎవరికీ అంతుపట్టడం లేదు. అసలు ఎమ్మెల్యేలు చంద్రబాబు మాట వింటున్నారా లేదా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. ఆ సందేహాలకి చిరు సమాధానాలే ఈ కథనం.
ఎమ్మెల్యేలలో అంతర మధనం.. ఎందుకంటే..?
తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 20 మందిలో సబ్జెక్ట్ ఉండి, పార్టీ పట్ల వీర విధేయత కలిగిన వాళ్ళు 10 మంది ఉన్నారు. ఈ 10 మంది జిల్లాల్లో మాట్లాడితే రాజధాని అంశం ఆయా నియోజక వర్గాలకు, వారి జిల్లాలకు వెళుతుంది. అంటే క్షేత్ర స్థాయిలో ఒక ఆలోచన, పోరాటం మొదలవుతుంది. కానీ ఈ రాజధాని అంశంపై ఎమ్మెల్యేలు ఎవరూ నోరు మెదపడం లేదు. ప్రకాశం జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు వీడియో సందేశం విడుదల చేశారు. మిగిలిన ఇద్దరు అసలు ఈ విషయం పై ఇసుమంత సందేశం కూడా ఇవ్వలేదు. విశాఖ జిల్లాలో కూడా చంద్రబాబు కు నలుగురు ఎమ్మెల్యే లు ఉన్నారు. ఆ నలుగురిలో ఏ ఒక్కరూ దీనిపై స్పందించ లేదు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు ప్రతి వ్యవహారానికి ఆందోళనలు, ధర్నా లు అంటూ విన్నూతంగా నిరసన లు చేసే అయన రాజధాని వ్యవహారంలో గమ్మున ఉన్నారు. ఏమి మాట్లాడటం లేదు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అలాగే అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ ఇలా చెప్పుకుంటే పేరెన్నిక గల ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. సబ్జెక్ట్ పరంగా కూడా వీరికి కొదవలేదు. పయ్యావుల కేశవ్ వంటి నేతలు అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడే సబ్జెక్ట్ ఉన్నవాళ్లు. కానీ రాజధాని అంశం లో మాత్రం చంద్రబాబు, లోకేష్ తప్ప మిగిలిన వారు పెద్దగా స్పందించినట్లు కనిపించడం లేదు. ఇది ఎందుకు అనేది చంద్రబాబు కు కూడా అంతుపట్టడం లేదు. ఎందుకు, ఎమ్మెల్యే లు ఏమి ఆలోచిస్తున్నారు. వారిలో అంతర్మధనానికి కారణం ఏమిటి అనేది తెలుసుకుంటే..
కేసుల భయమూ..కరోనా భయమూ
ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యేలపై నిఘా వేసి ఉంచింది. వైఎస్ జగన్ రూపంలో టీడీపీ ఎమ్మెల్యే ల పై కేసుల కత్తి వేలాడుతోంది. ఇప్పటికే జిల్లాల వారీగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల గత ప్రభుత్వంలో వారు చేసిన పాపాలు, అవినీతి చిట్టా అంతా ప్రభుత్వం సేకరించి ఒక విభాగంలో నిగుడపర్చింది. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యే లు, నాయకులు ఎవరైనా కట్టు తప్పి మాట్లాడినా, శృతి మించి వ్యాఖ్యలు చేసినా వారిపై పాత చిట్టా ఉపయోగించి కేసులు బనాయించడానికి జగన్ ప్రభుత్వం ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. దానికి సాక్షమే జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు వంటి నాయకుల అరెస్ట్ లు. ఇక ఈ జాబితాలో అనేక మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అనేది ఆయా ఎమ్మెల్యే లకు బాగా తెలుసు. అందుకే ఇవన్నీ చూసుకుంటున్న వాళ్ళు మన కెందుకు వచ్చిన వ్యవహారం, మన కెందుకు వచ్చిన తలనొప్పి అంటూ సైలెంట్ ఐపోతున్నారు. పనిలో పనిగా చంద్రబాబు గానీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి గాని ఏమైనా ఎమ్మెల్యేలకు అసైన్మెంట్, మాట్లాడమంటూ అసైన్ చేసినా సరే కరోనా అంటూ తప్పించుకుంటున్నారుట. దీనితో తెలుగుదేశం పార్టీలో రాజధాని పోరాటం చంద్రబాబు, లోకేష్ నారా వారి ఇంట తప్ప బయట ఎక్కడా వినిపించడం లేదు.