ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలను శాసించిన వ్యక్తిగా ఓ సంచలనం. కాంగ్రెస్ సీఎంలను మార్చేస్తూ ఉంటుంది.. అనే వాదన పక్కన పెట్టింది ఒక్క వైఎస్ విషయంలోనే అనేది సత్యం. ఇక్కడ వైఎస్ ప్రస్తావన ఎందుకంటే.. ఆయన వారసుడిగా సొంతంగా పార్టీ పెట్టుకుని సీఎం అయిన జగన్ కూడా వైఎస్ కు ధీటుగా అంతే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఏకంగా న్యాయవ్యవస్థపైనే యుధ్దానికి దిగి ఏపీ హైకోర్టు తీర్పులపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం దేశంలో అతిపెద్ద సంచలనం. ఇప్పుడు మరో న్యాయమూర్తిపై యద్ధానికి తెర తీస్తున్నారు. ఆయనే.. ఇటివల రిటైరైన న్యాయమూర్తి రాకేశ్ కుమార్. ఆయనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం.
జస్టిస్ రాకేశ్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం..
గతంలోనే ప్రభుత్వానికి రాకేశ్ కుమార్ కు మధ్య పొసగలేదు. మిషన్ బిల్డ్ ఎపి అధికారి ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ వేసిన ఒక పిటిషన్ సంచలనం రేకెత్తించింది. అంతకుముందే మిషన్ బిల్డ్ ఏపి కేసులో జస్టిస్ రాకేశ్ కుమార్ తప్పుకోవాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కోర్టుల్లోకి మీడియా అనుమతి ఉండదు. న్యాయవాదులు చెప్పినదాన్నే బేస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అలానే.. మిషన్ బిల్డ్ పై జస్టిస్ రాకేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలంటూ కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. వాటినే బేస్ చేసుకుని ప్రవీణ్ కుమార్ పిల్ వేసారు. దీనిపై రాకేశ్ కుమార్ మండిపడుతూ ఏకంగా ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆర్డర్ వేశారు. తాను అనని మాటలను ప్రవీణ్ ఎలా ఊటంకిస్తారని మండిపడ్డారు. అయితే.. రాకేశ్ కుమార్ అనని మాటలను రాసిన పత్రికలపై ఎటెవంటి వ్యాఖ్యలు కానీ.. చర్యలు గానీ రాకేశ్ కుమార్ తీసుకోకపోవడం విచిత్రం.
మజీ జస్టిస్ పై సుప్రీంకోర్టుకు..
మొత్తానికి రాకేశ్ కుమార్ రిటైర్ అయ్యారు. ప్రభుత్వంపై ఏకపక్షంగా కక్షపూరితంగా మాట్లాడి.. ప్రతిపక్షాలపై సానుభూతి తరహా వ్యాఖ్యలు చేసారని వార్తలు కూడా వచ్చాయి. ఆయనకు అమరావతి రైతులు వీడ్కోలు పలికిన తీరు ప్రతిఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన తీరు ఇటు ప్రభుత్వానికి ఇరకాటంగా మారితే.. న్యాయవర్గాల్లో విస్మయం కలిగించిందని చెప్పాలి. రిటైర్ అవుతూ ప్రవీణ్ కుమార్ విషయంలో తీర్పునిస్తూ పలు అంశాలు ప్రస్తావించారు. వాటిపైనే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. చీఫ్ జస్టిస్ కు జగన్ రాసిన లేఖ, ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు, జగన్ పై కేసులు, పోలీసులు ఒకే రోజు ఏడు కేసులు ఎత్తేయటం, జగన్ గురించి గూగుల్ లో వెతకటం.. ఇలా అనేక అంశాలు రాశారు. వీటిపైనే ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఏపీ సీఎస్ ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలు చేశారు.
ఆది నుంచీ విమర్శలే..
రాకేశ్ కుమార్ వ్యవహారంలో వైసీపీ నుంచి అనేక విమర్శలు వచ్చాయి. ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరించారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. రాజధాని అంశం, న్యాయమూర్తులపై వైసీపీ నాయకుల వ్యాఖ్యలు, ప్రభుత్వానికి ప్రతి అంశంలో హైకోర్టు నుంచి వ్యతిరేక తీర్పులు, అమరావతి భూముల విషయంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దొమ్మాలపాటి శ్రీనివాస్ పటిషన్లో గ్యాగ్ ఆర్డర్లు, ఏపీలో రాజ్యాంగ సంక్షోభం.. ఇలా చాలా అంశాల్లో ప్రభుత్వానికి హైకోర్టుకు మధ్య ఓ యుద్ధమే జరిగింది. ముఖ్యగా ఏపీలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవి ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్టైంది. ఇలా.. అప్పట్లో జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు మిషన్ బిల్డ్ పై ఇచ్చిన తీర్పులో ఆయన పొందుపరచిన పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. సీఎం జగన్ దూకుడుకు ఇదొక నిదర్శనంగా చెప్పాలి.