మహాభారతం క్లైమాక్స్ లో మాత్రమే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ప్రస్తుత రాజకీయ రణక్షేత్రం నిరంతరం కురుక్షేత్ర యుద్ధమే. అక్కడ అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేసి యుద్ధంలో సాయం చేశాడు. ఈ రాజకీయ యుద్ధంలో పరిపాలనను పరిగెట్టించే నైపుణ్యం సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఉంది. ఏడాదిన్నర పాలనలో తనదైన మార్క్ చూపించారు. ఎంత సీఎం అయినా.. సలహాలు, సూచనలు తప్పనిసరి. అలా సీఎంకు రాజకీయ, ఆర్ధిక సలహాదారుల అవసరం ఉంటుంది. ప్రస్తుతం సీఎం జగన్ కు రాజకీయ సలహాదారులు ఉన్నా.. ముఖ్యంగా ఆర్ధిక సలహాదారుల అవసరం మరింత ఉంది. ఈ నేపథ్యంలో సీఎం వీరిపై దృష్టి పెట్టారని తాజా సమాచారం.
ఆర్ధిక సలహాదారుడి వేటలో..
సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టలేదు. ఆర్ధికంగా చాలా భారం ఉన్నా.. జగన్ ఈ ఏడాదిన్నరలో చేసి చూపించారు. అంతవరకూ సంతోషమే. కానీ.. ఇన్ని ఫలాలు నిరంతరాయంగా అమలవ్వాలంటే రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావాలి. అదే కష్టంగా ఉంది. దీనిపై జగన్ ఓ నిర్ణయం తీసుకుంటున్నారు. నిపుణుడైన ఆర్ధిక సలహాదారుడిని నియమించుకుని.. ఆయనకు ఓ ఐఏఎస్ ను జత చేస్తే.. ప్రభుత్వాన్ని సంక్షేమంలో మరింత పరుగులు పెట్టించవచ్చనేది జగన్ ఆలోచన. వచ్చే మార్చికల్లా ఓ నిపుణడిని ( గతంలో ఆర్ధికమంత్రిగా సేవలు అందించిన) సలహాదారుడితోపాటు మరికొందరిని నియమిస్తే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఏం చేయాలనేదానిపై స్పష్టత వస్తుందని ఆలోచన.
స్పష్టమైన వైఖరితో సీఎం జగన్..
ఇప్పటికే పార్టీలోని కొందరిని సలహాదారులుగా నియమించారు జగన్. అయితే.. పార్టీ మీద అభిమానం ఉంటే కాదు.. ప్రభుత్వాన్ని నడిపించే ప్రణాళికలు వేసి సీఎం పని సులువు చేయాలి. అలా చేయనివారిని జగన్ పక్కన పెడుతున్నారు. మరికొందరు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైతే ప్రభుత్వం అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇస్తోంది. పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, విదేశఈ ఎఫ్ డీఐలు రావట్లేదు. ఇందుకు అనేక రాజకీయ కారణాలు, ప్రతిపక్షాల వైఖరి కూడా కారణం అవుతున్నాయి. వీటన్నింటిని అధిగమించి రాష్ట్రాన్ని నడిపించాలంటే ఇప్పుడున్న ఆర్ధిక సలహాదారుల ప్యానెల్ ను మరింత పటిష్టం చేయాలి. అలా చేస్తే ప్రజల్లో ప్రభుత్వంపై బలమైన ముద్ర వేయొచ్చనేది సీఎం జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకు ప్రయత్నాలు ప్రారంభించనట్టు తెలుస్తోంది.