Vizag Steel Plant.. ఘన చరిత్ర ఉన్న ఉత్తరాంధ్ర.. ఇప్పుడు “ఉత్త”రాంధ్రగా మారేలా ఉంది. అలా అనడం కంటే మారుస్తోంది ఎవరు..? “ఉత్త”రాలతో ఉత్తుత్తి ఫలితాలే తప్ప ప్రజల ఆకాంక్ష నేరవేరుతుందా..? ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అనేక ఉద్యమాలు, 32 మంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిన ‘విశాఖ ఉక్కు కర్మాగారం’.. ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. అమరావతి రైతుల ఉద్యమం, విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాజధాని తరలింపు.. కూడా ఇప్పుడు ఈ అంశం ముందు చిన్నబోతున్నాయి. తూర్పున బంగాళాఖాతంలో కేంద్ర ప్రభుత్వం వేసిన ఈ చిన్న రాయి అల్లకల్లోలం రేపుతోంది. పెను ఉప్పెనగా మారుతోంది. దశాబ్దాలుగా ఏపీకి జరుగుతున్న అన్యాయాల్లో ఇదొకటిగా తీరం దాటుతుందా.. లేక దిశ మార్చుకుని వెళ్లిపోతుందా..?
ఏపీ అంటే చులకనే.. ఎప్పుడూ
తెలంగాణ సీఎం కేసీఆర్ సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో.. ‘ఆంధ్రులు ఆరంభశూరులు’ అన్నారు. నిజంగా అదే జరిగింది. రాష్ట్రం విడిపోకూడదని చేసిన ఆ మహోద్యం ఉధృతంగానే జరిగినా రాజకీయాల కారణంగా చల్లబడిపోయింది. ఏపీకి అన్యాయం జరిగింది. వైఎస్ నేతృత్వంలో.. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 32కు పైగా ఎంపీలు కాంగ్రెస్ నుంచి గెలిచారు. ‘యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో ఏపీదే అగ్రతాంబూలం.. ఏపీ మాకెంతో చేసింది’ అని చెప్పారు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ. కానీ.. అవి మాటలకే పరిమితమయ్యాయి. బడ్జెట్ కేటాయింపులు పక్కనపెడితే కనీసం రైల్వే కేటాయింపుల్లో కూడా ఆ పదేళ్లలో ఏనాడూ న్యాయం జరగలేదు. తూతూమంత్రంగా ఇచ్చిన సహాయ మంత్రి పదవులే. ఏపీలో సమర్ధులు లేరా..? అనే ప్రశ్న మనల్నే వేసుకోమన్నారు. ఉమ్మడి ఏపీని విభజించే సమయంలో కూడా ఆంధ్రుల ఘోష వారికి పట్టలేదు.
యూపీఏ నుంచి ఎన్డీఏకి మారినా..
యూపీఏ నుంచి ఎన్డీఏకు మారి.. ప్రత్యేక హోదా పక్కకు వెళ్లి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినా ఇప్పటికీ ఏం ఒరగలేదు. ఆమధ్య తెలుగు వారికే గర్వకారణమైన ఆంధ్రా బ్యాంకును కూడా విలీనం చేసేసింది ఎన్డీఏ. మరో రెండు మూడేళ్లలో శత వసంతోత్సవం జరుపుకుంటుందని భావించేలోపే ఆంధ్రా బ్యాంకును కనుమరుగు చేసేశారు. ఏపీని పెద్ద ఒత్తిడీ రాలేదు.. వచ్చినా ఆగేదీ కాదు. ఎన్డీఏ బలం అలాంటింది. ప్రధాని మోదీ, అమిత్ షా బలం ముందు వారు ఏ నిర్ణయం తీసుకున్నా వెనకడుగు వేసే ప్రసక్తే ఉండట్లేదు. ఇప్పుడు ఇందులో విశాఖ ఉక్కు కర్మాగారం చేరింది. ఉమ్మడి ఏపీలో ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం అదిలాబాద్, నిజామాబాద్ నుంచి కూడా వచ్చి ఉద్యమం చేసిన చరిత్ర ఉంది. దేశంలోని సముద్రతీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్. ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర వారికి స్టీల్ ప్లాంట్ ఒక తిరుమల కొండ. అటువంటి ప్లాంట్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చేసి ప్రైవైటుకి ఇస్తామని చెప్పడం ఆంధ్రులంటే ఎన్డీఏకు ఉన్న మరో చులకన భావం తప్పించి మరొకటి కాదు. చెప్పాలంటే.. తక్కువ సమయం ప్రధానిగా ఉన్న దేవెగౌడ కర్ణాటకకు చేసుకున్న సాయం.. అయిదేళ్లు ప్రధానిగా ఉన్నా పీవీ హయాంలో ఏపీకి చేసుకుంది శూన్యం.
సీఎం జగన్ పైనే భారం.. Vizag Steel Plant
ఇప్పుడు ఈ అంశాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాల్సింది సీఎం జగన్. 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలు వైసీపీ తిరుగులేని బలంతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సమయం. తన సత్తా చాటాల్సిన సమయం. పైగా.. అదే విశాఖలో రాజధాని ఏర్పాటు కోసం వేగంగా అడుగులు వేస్తున్న జగన్ కు ఇప్పుడక్కడ అడుగు పెట్టాలంటేనే వణుకు తెప్పించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రధానికి లేఖ రాసిన జగన్ అదొక్కటీ చేస్తే సరిపోయేది కాదు. రాజకీయ పక్షాలన్నీ ఉద్యమం ఉధృతం చేసి తమ రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నా వైసీపీ తనను తాను కాపాడుకోవాల్సిన తరుణం ఇది. కేంద్ర నిర్ణయానికి ఏపీ బీజేపీ ఈ విషయంలో కుక్కిన పేనులా అయిపోయింది. టీడీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి పరిస్థితి. ఇప్పుడేం చేయాలన్నా సీఎం జగనే చేయాలి. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినా.. రాష్ట్రాన్ని విడదీయటానికి వీల్లేదంటూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఏం జరిగిందో చూశాం. మరి.. ఈ విషయంలో ఉత్తరాంధ్రను.. ‘ఉత్త’రాంధ్ర చేస్తారో.. ఉత్త(మ)రాంధ్రగా మారుస్తారో చూడాలి.