హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. గత గవర్నర్ నరసింహన్ కూడా ఇలాగే వ్యవహరించేవారని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి వీహెచ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై వీహెచ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గవర్నర్ను కలవాలని తాము ఎంతగా ప్రయత్నిస్తున్నా… వీలుపడటం లేదన్నారు. పాత గవర్నర్ మాదిరి వ్యవహరించరాదని తమిళిసైని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలయ్ బలయ్ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకుల బొమ్మలు లేకపోవడాన్ని కూడా వీహెచ్ తప్పుబట్టారు. పార్టీలకు అతీతంగా దత్తాత్రేయ నిర్వహించే ఈ కార్యక్రమంలో తమ ఫోటోలు కూడా పెట్టాలని ఆయన నిర్వాహకులను కోరారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన తరువాత దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో లేదో అని తాను సందేహించానని… కానీ ఆయన మాత్రం తన ప్రోటోకాల్ను పక్కనపెట్టి మరీ ఈ కార్యక్రమాన్ని యథాతథంగా నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని వీహెచ్ చెప్పారు.
జలవిహార్లో అలయ్ బలాయ్ కార్యక్రమం జరిగింది. అలాయ్ బలాయ్లో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, మాజీ ఎంపీ వీ హన్మంతరావు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు గవర్నర్ దత్తాత్రేయ శాలువాతో సన్మానించారు.