విజయవాడ:కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం హర్షణీయమంటూ కేటీఆర్ తో భేటీ అనంతరం జగన్ ప్రకటించడంపై టిడిపి మండిపడుతోంది. జగన్ నిర్ణయం ఇదేనని తమకు ముందే తెలుసని…చంద్రబాబు గత కొంతకాలంగా ఈ విషయమై ఎపి ప్రజలను అప్రమప్తం చేస్తూనే ఉన్నారని టిడిపి నేతలు దుయ్యబడుతున్నారు. కెటిఆర్-జగన్ తమ భేటీ అనంతరం సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాల నుండి రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా, హక్కులు కాపాడుకోవాలంటే మద్దతుగా ఉండే ఎంపీల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు.
జగన్ ఇంకా మాట్లాడుతూ రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం హర్షణీయమని…ముఖ్యంగా ఎపి లాంటి రాష్ట్రాల హక్కులు కాపాడుకోవాలంటే ఎంపిలు సంఖ్యా పరంగా పెరగాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎంపిలు 25మందికి తోడు తెలంగాణా ఎంపీలు 17మంది మొత్తం 42మంది పార్లమెంట్లో ఒక్కటిగా మాట్లాడితే ఏమైనా సాధించుకోవచ్చని అన్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఒక ప్లాట్ ఫాం తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామని జగన్ చెప్పారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ రూపకల్పన చేయడం జరిగిందని, అదే విషయాన్ని జగన్ కు వివరించడం జరిగిందన్నారు.
మరోవైపు కెసిఆర్ దిశానిర్ధేశంతో జరిగిన కెటిఆర్-జగన్ భేటీ…తదనంతరం ఈ ఇరువురి నేతల ప్రకటనలపై టిడిపి నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ కెసిఆర్ ది ఫెడరల్ ఫ్రంట్ కాదని, మోదీ ఫ్రంట్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ముందునుంచే చెబుతున్నవిధంగా ఇది ముగ్గురు మోదీల జగన్నాటకమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి చేసిన దూషణభాషణలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. ఏపీ ప్రజలను తిట్టిపోసిన కేసీఆర్తో కలవడానికి జగన్కు సిగ్గుండాలని, రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు జగన్ సిద్దమయ్యాడన్నారు.
కెటిఆర్-జగన్ భేటీపై మరో మంత్రి నారాయణ కూడా స్పందించారు. వీరి తాజా భేటీతో ఇంతవరకు తెరవెనుక ఉన్న కుట్ర ఇప్పుడిప్పుడే బయటకు వస్తోందని మంత్రి నారాయణ విమర్శించారు. వీరి కలయిక గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిందే జరుగుతోందని అన్నారు. అయినా ఫెడరల్ ఫ్రంట్ ముసుగుతో వీరు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీని వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రయోజనాల కోసం పోరాడుతున్న చంద్రబాబుపై దాడి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మోదీని మళ్లీ ప్రధానిని చేసేందుకే కేసీఆర్ మూడో ఫ్రంట్ ను తెర మీదకు తెస్తున్నారని…ఈ ముగ్గురు మోదీల డ్రామా ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తోందని పునరుద్ఘాటించారు.
కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి టిడిపి అధినేత ఎపి సిఎం చంద్రబాబు ఇటీవల మాట్లాడుతూ…”దేశంలో భాజపా అనుకూల, వ్యతిరేక కూటములకే అవకాశముంది. మూడో కూటమికి ఆస్కారం లేదు. భాజపా, కాంగ్రెస్లలో ఏదో ఒక పార్టీ లేకుండా కూటమి సాధ్యం కాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ రెండింటిలో ఏదో ఒక పార్టీ లేకుండా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడలేదు. దానినిబట్టే విధానం ఉండాలి తప్ప విశ్వామిత్ర సృష్టి చేసేస్తా. కొత్త వ్యవస్థ తీసుకొచ్చేస్తా? అని కేసీఆర్ ఎలా చెబుతారు? కేసీఆర్ ఏర్పాటు చేద్దామని భావిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ సాకారమయ్యే పరిస్థితులు లేవు. కెసిఆర్ ప్రతిపాదిత ఫ్రంట్ మోడీకి మేలు చేసేందుకే”…అని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు అప్పటినుంచే ఆయన ప్రతి సమావేశంలోనూ మోదీ,కెసిఆర్,జగన్ లను ముగ్గురు మోదీలుగా అభివర్ణిస్తూ వస్తున్నారు. తాజాగా కెటిఆర్-జగన్ భేటీ…తదనంతరం ఇరువురి నేతల వ్యాఖ్యలు కూడా చంద్రబాబు ఆరోపణలనే బలపరిచేవిధంగా ఉన్నాయని చెప్పకతప్పదు.