అమరావతి: వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి టిడిపి నేతలను విమర్శిస్తూ ట్వీట్లు పోస్టు చేస్తుండటంపై టిడిపికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. దూషణ పదాలతో విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు.
జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఎ 2 నిందితుడితో నీతులు చెప్పించుకోవాల్సిన ఖర్మ పట్టిందని ఉమా వాపోయారు. బ్రీఫ్ కేసు కంపెనీలు పెట్టి ఏ 2 ముద్దాయిగా 16నెలలు జైలులో ఉండివచ్చిన ఆయనకు నేడు కాలం కలిసి వచ్చింది, నేడు ఢిల్లీలో క్యాబినెట్ హోదా వెలగబెడుతున్నాడంటూ ఉమా దుయ్యబట్టారు. అసత్య ఆరోపణలతో ట్వీట్ల మీద ట్వీట్ చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా పిచ్చిమాటలు మానుకోవాలని ఉమా సూచించారు. అధికారం ఎప్పుడూ ఎవరికీ శాశ్వతంగా ఉండదని ఉమా అన్నారు. భవనాలు కూలిస్తేనో, గోడలు పడగొడితే ప్రజలు హర్షించరనీ మంచి పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారని ఉమా అన్నారు. పోలీసు కేసులకు, లాఠీ చార్జీలకు బెదిరేది లేదనీ, త్యాగాలకు సిద్ధంగా ఉన్నామనీ ఉమా పేర్కొన్నారు.