తిరుమల: టిడిపి అధినేత చంద్రబాబుపై తెలంగాణకు చెందిన ఆ పార్టీ మాజీ సీనియర్ నేత మాత్కుపల్లి నర్శింహులు మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని నర్శింహులు జోస్యం చెప్పారు. చంద్రబాబు పరాజయం తన కెంతో ఆనందాన్ని ఇచ్చిందని మోత్కుపల్లి పేర్కొన్నారు. నేడు మోత్కుపల్లి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలని తిరుమలలో మెట్టుమెట్టుకూ తాను మొక్కుకున్నాననీ, ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకునేందుకు వచ్చానని మోత్కుపల్లి అన్నారు. నమ్మినవారిని నట్టేట మంచే చంద్రబాబు రాజ్యసభ సీటును వంద కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఒక్క ఎస్సికి గానీ, ఒక బిసికి గానీ పదవులు ఇవ్వలేదని మోత్కుపల్లి మండిపడ్డారు. తెలంగాణ నుండి చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తరిమివేశారనీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగిందని మోత్కుపల్లి అన్నారు.
రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపేలా వైఎస్ జగన్కు భగవంతుడు శక్తి సామర్థ్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు మోత్కుపల్లి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన సందర్భంలోనూ మోత్కుపల్లి ఆధ్వర్యంలో హైదరాబాదులో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.