ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అనేక కొత్త చట్టాలను తీసుకురావడంతో పాటు ప్రస్తుతమున్న చట్టాల్లోనూ కీలక మార్పులు తీసుకువస్తున్నది. ఇటీవలే కార్మిక చట్టాలతోపాటు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి వయస్సుకు సంబంధించి సరికొత్త చట్టాలను తీసుకురావడానికి తమ సర్కారు చర్యలు తీసుకుంటున్నదని ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించన కార్య క్రమంలో ప్రధాని మోడీ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, రూ.75 స్మారక నాణేన్ని విడుదల చేశారు. దీనితో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన 17 రకాల పంటలకు చెందిన కొత్త వంగడాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి అవసరమైన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందనీ, రైతులకు కనీస మద్ధతు ధర లభించేలా తమ సర్కారు చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని మరోమారు స్పష్టం చేశారు.
అలాగే, ‘తమ కుమార్తెల వివాహానికి సరైన వయస్సును నిర్ణయించడానికి చర్చ జరగుతోంది. పెళ్లి వయస్సు కు సంబంధించిన దేశ నలుమూలల నుంచి లేఖలు వచ్చాయి. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలు వచ్చిన వెంటనే నూతన చట్టాన్ని రూపొందిస్తాం’ అని మోడీ అన్నారు. తమ బిడ్దల సంరక్షణకు కట్టుబడి ఉన్నామనీ, దీని కోసం మరిన్ని మెరుగైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే, మహిళల ఆరోగ్యం, పరిశుభ్రత నిర్వహణకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావించారు.