గడచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా అఖండ మెజార్టీతో విజయం సాధించగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. తొలి ఏడాదిలో సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యక దృష్టి పెట్టడంతో ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత కనబడలేదని అంటున్నారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినా, నిరసనలు నిర్వహించినా ప్రజల నుండి పెద్దగా స్పందన రాలేదంటున్నారు. తొలి ఏడాది పాలనను జగన్ సమర్ధవంతంగా పూర్తి చేసినా అధికార పార్టీలో కాస్త భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఇప్పటి వరకు వైకాపాలో జగన్ కు భజన చేసే వారే ఉన్నారని భావిస్తుండగా, ప్రభుత్వంలో తప్పులు జరిగితే ఎత్తి చూపే వారు కూడా ఉన్నారని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. వీరిలో నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘు రామ కృష్ణం రాజు మొదటి స్థానంలో ఉన్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ లాంటి మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ నేతలు కూడా గళం విప్పినప్పటికీ, వారు నేరుగా పార్టీ అధిష్టానంపైన, సీఎం జగన్ పైనా విమర్శించలేదు. కేవలం అధికార యంత్రాంగం తీరుపై విమర్శించారు.
అయితే రఘు రామ కృష్ణం రాజు మాత్రం పార్టీ అధిష్టానంపై, జగన్ తీరుపై విమర్శలు చేశారు. ఇప్పుడు పార్టీకి, జగన్ కు రఘు రామ కృష్ణం రాజు ఒక్కడు మాత్రమే తలనొప్పిగా మారాడని అనుకుంటుండగా ఇప్పుడు మరికొన్ని సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. మరి కొందరు నేతలు కూడా రఘు రామ కృష్ణం రాజు బాటలో జగన్ వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అసంతృప్తిపై అందరూ బయట పడటం లేదు కానీ అలాంటి వారు పార్టీలో ఉన్నారనే మాట రాజకీయ వర్గాలలో వినపడుతుంది.
ఈ నేపథ్యంలో రఘు రామ కృష్ణం రాజు వ్యవహారాన్ని పార్టీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయన నేరుగా ముఖ్య మంత్రి వ్యవహారంపై, పార్టీ అధిష్టానం, స్వపక్షంలోని నేతలపైనా విమర్శలు చేయడంతో పాటు తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లాక్ సభ స్పీకర్ కు లేఖ రాయడంపై పార్టీ సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు గానూ షోకాజ్ నోటీసు కూడా రఘు రామ కృష్ణం రాజుకు జారీ చేస్తున్నట్టు సమాచారం.