ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్లిష్టమైన సమయంలో ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీని వరదలు ముంచెత్తుతున్న తరుణంలో ఆయన ఆలస్యం చేయకుండా కేంద్రానికి లేఖ రాశారు.
అయినప్పటికీ, సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని, అధికారులతో సమీక్షలు నిర్వహించడం లేదని పేర్కొంటూ ప్రతిపక్ష తెలుగుదేశం విమర్శిస్తోంది. అయితే, తాజాగా సీఎం జగన్ ఈ విమర్శలకు చెక్ పెట్టే కీలక నిర్ణయం తీసుకున్నారు.
వాళ్లందరితో సీఎం జగన్..
ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, వివిధ రకాలైన నష్టంపై అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయ పునరావాస కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులు చేస్తున్న కృషిని అభినందించారు. మరింతగా ప్రజలకు అండగా ఉండాలని కోరారు.
వెంటనే ఆదుకోవాలి
వరద బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు. కలెక్టర్లు, జేసీలు ఈ విషయంలో ఉదారంగా ఉండాలని ఆయన సూచించారు. వరద పీడిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు (ముంపునకు గురైన ఇళ్లు) 25 కేజీల బియ్యం, ఒక కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు తప్పనిసరిగా పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అదే విధంగా సహాయ శిబిరాల్లో ఉన్న వారిని వెనక్కి పంపించేటప్పుడు రూ.500 వారికి అందించాలని తద్వారా ఆ కుటుంబానికి ఆ మొత్తం ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని తెలిపారు. తమ ఇంటికి వెళ్లగానే డబ్బుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని వెల్లడించారు.
జగన్ పెద్ద మనసు
చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం వెంటనే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సీఎం జగన్ ఆదేశించారు. “రాష్ట్రంలో ఇప్పటి వరకు 19 మంది చనిపోగా, 14 మందికి ఇచ్చారు. మరో 5 గురు పెండింగ్లో ఉన్నాయి, ఆ కుటుంబాలకు కూడా వెంటనే ఆ పరిహారం ఇవ్వండి.“ అంటూ స్పష్టం చేశారు. వరదల కారణంగా ఇబ్బందులు ఎదురైన ప్రాంతాల్లో వెంటనే రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. శానిటేషన్, శుభ్రమైన తాగునీరు సరఫరాపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
నష్టాలపై నివేదికలు ఇవ్వండి
వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట నష్టంపై పూర్తి స్థాయిలో అంచనాలు రూపొందించి ఈనెల 31వ తేదీలోగా కలెక్టర్లు నివేదికలు పంపాలని సీఎం జగన్ తెలిపారు. “వరద నష్టం అంచనాలతో పాటు, కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలు కూడా ఈనెల 31లోగా పంపాలి. ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ ఆ రైతుల పేర్లు ఆర్బీకేలలో ప్రదర్శించాలి. ఎవరైనా రైతులు తమ పేర్లు లేవని చెబితే సోషల్ ఆడిట్ చేయాలి. ఈ–క్రాపింగ్ నమోదు ఆధారంగా సాగు చేస్తున్న రైతులను పక్కాగా గుర్తించాలి. సీఎం జగన్ కీలక నిర్ణయాలతో అయినా తెలుగుదేశం పార్టీ శ్రేణులు విమర్శలు కట్టిపెట్టాలని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.