జగన్ వైఖరి ఏ ఒక్కరికీ అంతు పట్టదు..! ఎవరిని.., ఎప్పుడు, ఎందుకు.. కలుస్తారు..? పార్టీలో చేర్చుకుంటారు..? అనేది ఆయనకు మాత్రమే తెలుసు. పార్టీలో చేరిపోయాం అని చెలరేగిపోదాం అంటే అటూ ఇటు కాకుండా పోతుంది. రాజకీయ భవిష్యత్తు గందరగోళం అవుతుంది..!!
వల్లభనేని పరిస్థితి ఏమయ్యింది..?
అవును వల్లభనేని వంశీ పరిస్థితి ఏమైంది..? “అధికార పార్టీలో చేరారు. అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కేసుల నుండి బయటపడుతున్నారు. అంతా బాగానే ఉంది. టీడీపీని విపరీతంగా తిడుతున్నారు. పెద్ద చిడతలతో జగన్ కి భజనలు చేస్తున్నారు. వైసీపీలో కంఫర్ట్ గానే ఉంటున్నారు” అనుకుంటే పొరపాటే. బయటకు తెలియని అంతర్గత పోరు అక్కడ ఉంది. బయట ప్రపంచానికి తెలియని పోరు గన్నవరంలో రగులుతుంది. వంశీ టీడీపీని ఎంతగా తిడుతున్నా.., చంద్రబాబుని ఎంతగా ఎదిరిస్తున్నా.., లోకేష్ ని ఎంతగా చులకన చేస్తున్నప్పటికీ… ఆయనకు వైసీపీలో అనుకున్న పరిస్థితులు కలగడం లేదు. ఆయన ఇప్పుడు రాజకీయంగా అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. “పార్టీలో విలువ దక్కడం లేదు. నానాటికీ గొడవలు పెరుగుతున్నాయి. కొట్టుకుంటున్నారు. వంశీని లెక్క చేయడం లేదు. వైసీపీ ఈయన్ను ఆదరించడం లేదు. టీడీపీ వారు వెళ్లడం లేదు” అలా రెండు చోట్ల వంశీ చెడ్డగా మారిపోయారు. వంశీకి కేవలం ఆ జిల్లాలో మంత్రి కొడాలి నాని మాత్రమే మద్దతుగా ఉన్నారు. వేరే ఎమ్మెల్యేలు, నేతలు, పెద్ద నాయకులూ పెద్దగా పట్టించుకోవట్లేదట.
అందుకే రాజకీయాలకు దూరం డ్రామా..!!
వైసీపీలో వంశీ చేరిక పట్ల గన్నవరంలో వైసిపి వర్గాలు లోలోపల రగిలిపోతున్నాయి. పదేళ్ల పాటు కష్టపడి, కేసులు ఎదుర్కొంటే… ఇప్పుడు వంశీ వర్గం వచ్చి పెత్తనం చెలాయిస్తామంటే ఊరుకోము” అంటూ హెచ్చరిస్తున్నారు. జగన్ ని కూడా ఆలెక్క చేసే పరిస్థితి లేదు. వీటిని గ్రహించిన వంశీ వర్గం మళ్ళీ “రాజకీయాలకు గుడ్ బాయ్” అనే పాట పాడుతుంది. గతంలో కూడా వైసీపీ బాగా వేధిస్తోందని, వంశీ రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పేస్తున్నారు అంటూ ఇదే వర్గం ప్రచారం చేసింది. కానీ వంశీ వైసీపీలో చేరారు. తాజాగా మళ్ళీ ఇదే రాజకీయాలకు గుడ్ బాయ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇవన్నీ రాజీనామా డ్రామాలు. అంటూ వైసీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. సరే ఇవన్నీ కాదు. తాను అర్జంటుగా జగన్ ని కలిసి తాడో పేడో తేల్చుకోవాలని వంశీ గట్టిగా నిర్ణయించుకున్నారట.
చీరాలలోనూ కొత్త తల నొప్పులు..!!
చీరాలలో కరణం పరిస్థితి భిన్నంగా మారింది. టీడీపీని వీడినప్పటి నుండి కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ ఇద్దరూ పెద్దగా టీడీపీని విమర్శించినా దాఖలాలు లేవు. వంశీ చంద్రబాబుని అంతగా తిడుతుంటేనే వైసీపీ నమ్మడం లేదు. ఇక్కడ వీళ్ళు టీడీపీని తిట్టడం మానేసి.., సొంత పార్టీ ఇంచార్జి ఆమంచి కృష్ణ మోహన్ ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో వైసీపీలో వీరిని పెద్దగా నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీని విమర్శించకపోవడం.., పైగా వెంకటేష్ టీడీపీకి చెందిన ఓ కీలక వాట్సాప్ గ్రూపులో అడ్మిన్ గా ఉన్నట్టు ఇటీవల కొన్ని కథనాలు రావడంతో చీరాలలో వైసీపీ వర్గాలు రగిలిపోతున్నాయట. వీరి వైఖరిపై అధిష్టానానికి పిర్యాదులు మీద పిర్యాదులు వెళ్తున్నాయి. అందుకే వీళ్ళు కూడా జగన్ ని కలవాలి, తమ వాదన చెప్పుకోవాలి అనుకుంటున్నారట. వీరికి కూడా జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మినహా ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు పెద్దగా దగ్గరకు రానీయకపోవడంతో భిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి అంటున్నారు.