అమరావతి: రోజు కేసుల గొడవ ఎందుకని కొంత కాలం ట్రావెల్స్ వ్యాపారం మానేయ్యాలని భావిస్తున్నట్లు టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి తెలిపారు. గత కొద్ది రోజులుగా జెసి దివారకరరెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేసి సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ప్రతీకార వాంఛ ఎక్కువైందని విమర్శించారు. ప్రత్యర్థులను హింసించే సమయంలో అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గ్రహించాలని జెసి హితవు పలికారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లనే అధికారులు వేధిస్తున్నారని అన్నారు.
టిడిపి నుండి బయటకు వెళ్లే వారు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి చంద్రబాబుపైనా, పార్టీపైనా ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. వేధింపులకు భయపడి పార్టీలు మారకూడదని అన్నారు.నాలుగు రోజులు జైలులో పెట్టినా ఫరవాలేదు, ధైర్యంగా నిలబడితే పోయేది ఏమిలేదని జెసి వ్యాఖ్యానించారు. పవన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లాడో తనకు తెలియదని పేర్కొన్నారు.