(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులు ఓ మెట్టు దిగారు. విలీనం అంశాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, మిగతా అంశాలపై చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని.. ఆ డిమాండ్ను పక్కనబెడితే చర్చలకు సిద్ధమని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయినప్పటికీ కార్మిక సంఘాల నేతలు బెట్టు వీడకపోవడంతో ప్రభుత్వం.. ఆర్టీసీ సమ్మెపై మరింత కఠినంగా వ్యవహరించింది. సంస్థలో సగం బస్సులకు ప్రైవేట్ రూట్ పర్మిట్లకు అనుమతులిస్తూ కేసీఆర్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కార్మికులు తమ నిర్ణయం మార్చుకోకుంటే పూర్తిగా ప్రైవేట్ పర్మిట్లు ఇవ్వడానికి కూడా వెనుకాడమని హెచ్చరించింది.
ఆర్టీసీ సమ్మె ఆంశం ప్రస్తుతం కోర్టులో ఉంది. రాష్ట్రంలోని 5,100 రూట్లలో ప్రైవేటు పర్మిట్లపై హైకోర్టులో గురువారం(నవంబర్ 14) విచారణ కొనసాగింది. రూట్ పర్మిట్లపై ఇచ్చిన స్టేను న్యాయస్థానం సోమవారం(నవంబర్ 18) వరకు పొడిగించింది. కేసు విచారణనను సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా ఆర్టీసీ ఆంశంపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానంలో విచారణ సందర్భంగా ప్రస్తావించిన అంశాలను అడ్వొకేట్ జనరల్.. సీఎం కేసీఆర్కు వివరించినట్లు సమాచారం.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ సమస్యలను పరిష్కరించాలని గత అక్టోబర్ 5వ తేదీ నుంచి కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. రోజులు తరబడి సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందిచడం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని భీష్మించుకొని కూర్చుంది. దీంతో ఆర్టీసీ కార్మికులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. మనోవేదనకు గురై గుండెపోటుతో కొంతమంది మృతి చెందితే మరికొంతమంది ఆత్మ బలిదానాలు చేసకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఓ మెట్టు దిగుతూ నిర్ణయం ప్రకటించింది. విలీనం డిమాండ్ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని.. ప్రభుత్వం చర్చలకు పిలవాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. అయితే, దీనిపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.