గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గంలో మొదటి నుండి వైసీపీ పార్టీ కోసం కృషి చేసిన నాయకుడు మర్రి రాజశేఖర్. తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నుండి అనేక రాజకీయ పరమైన ఇబ్బందులు వచ్చినా కానీ వైసిపి జెండాని అన్ని రీతుల నిలబెట్టి నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం సరైన ప్రతిపక్ష పాత్ర పోషించారు మర్రి రాజశేఖర్. అటువంటిది సరిగ్గా 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు మర్రి రాజశేఖర్ ని పక్కన పెట్టి ఎమ్మెల్యే టికెట్ విడుదల రజిని కి వైయస్ జగన్ కేటాయించడం జరిగింది.
దీంతో మర్రి అనుచరవర్గం అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తీవ్రస్థాయిలో విభేదించి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు చేయడం జరిగింది. వెంటనే జగన్ అలర్ట్ అయ్యి మర్రి రాజశేఖర్ ని పిలిపించుకుని ఎమ్మెల్సీ హామీ ఇవ్వటంతో పరిస్థితి చాలావరకు సద్దుమణిగింది. ఇటువంటి తరుణంలో ఇటీవల మర్రి రాజశేఖర్ కి గవర్నర్ కోటాలో జగన్ ఎమ్మెల్సీ బెర్త్ కన్ఫర్మ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్త గుంటూర్ రాజకీయాలలో వైరల్ అయింది. పోనీలే మాట ఇచ్చాడు వైయస్ జగన్…. పార్టీ కోసం కష్టపడిన మర్రి రాజశేఖర్ విషయంలో న్యాయం చేశాడు అని అందరూ భావించారు. ఈ లోపు వచ్చిన వార్తలు ఫేక్ వార్తలని కావాలని కొంతమంది వైసీపీ పార్టీ అంటే గిట్టని వాళ్లు చేస్తున్నారని వైసిపి పార్టీకి చెందిన వాళ్ళు చెప్పుకొస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో వైసిపి పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాని వారిని టార్గెట్ చేసి ఇలా అధిష్టానం పైకి ఉసిగొలుపు తున్నారని విమర్శిస్తున్నారు. దీంతో కష్టపడిన మర్రి రాజశేఖర్ అందలం ఎక్కుతాడు అని అనుకున్న లోపే వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని తేలడంతో మర్రి మద్దతుదారులకు కొంత నిరుత్సాహాన్ని కలిగించినట్టు సమాచారం.