అదృష్టం కలిసొస్తే అందలం ఎక్కొచ్చు.. కలిసిరాకపోతే.. ఘన చరిత్ర ఉన్నా అందలం ఎక్కలేకపోవచ్చు. కష్టం వేరు.. అదృష్టం వేరు. కష్టానికి అదృష్టం తోడవ్వాల్సిందే. సినిమాటిక్ గా చెప్పాలంటే.. గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కాదు.. ఆవగింజ అంత అదృష్టం ఉండాలి. ప్రస్తుతం ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు స్థితి అదే. వృత్తిపరంగా డాక్టర్. ప్రవృత్తి పరంగా రాజకీయ నాయకుడు. ఇప్పుడు రాజకీయమే వృత్తి అయి కూర్చుంది. జగన్ పై అభిమానం రాజకీయాల్లోకి వచ్చేలా చేస్తే.. ఆయన ఛరిష్మా అప్పలరాజును ఎమ్మెల్యే చేసింది. ఆ అభిమానమే జగన్ కు నమ్మకంగా మారి ఏకంగా మంత్రి అయ్యేలా చేసింది. ప్రస్తుతం ఆయన జగన్ ఇలాకాలో ఏపీ పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ.. ఆయన దూకుడు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో.. మరీ ముఖ్యంగా సొంత జిల్లా శ్రీకాకుళంలో చర్చనీయాంశంగా మారింది.
వాళ్లిద్దరినీ మించి..
మంత్రిగా బాధ్యతలు స్వీకరించి శాఖపై పట్టు సాధించి తనదైన మార్కు చూపిస్తున్నారు. అంతేకాదు.. ప్రతిపక్షాలపై దూకుడుగా వెళ్తున్నారు. పదునైన విమర్శలతో రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్.. ప్రతిపక్షాలపై విరుచుకుపడే తత్వం తెలిసిందే. వాళ్లది మాసివ్ స్టైల్ అయితే.. అప్పలరాజుది క్లాసిక్ స్టైల్. పంచ్ లతో సూటిగా, సుతిమెత్తగా ప్రతిపక్షాలను రెచ్చగొట్టే డైలాగులు వేస్తారు. దీంతో రాష్ట్రంతోపాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఆయన పేరు మోగిపోతోంది. దీంతో ఈయన దూకుడుపై టీడీపీ దృష్టి పెడుతోంది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఇదే జిల్లాకు చెందిన వ్యక్తి. రాజకీయంగా కూడా పెద్ద కుటుంబం. అప్పలరాజు స్పీడుతో అచ్చెన్నాయుడు ఆయన్ను టార్గెట్ చేసుకుని భూకబ్జాలు, అవినీతి, దౌర్జన్యం.. పెరిగిపోతున్నాయని విమర్శలు చేస్తున్నారు. డాక్టర్ గా కూల్ గా ఉంటారేమో కానీ.. మంత్రిగా తన ఇన్నర్ పవర్ చూపిస్తూ అచ్చెన్నాయుడికి, టీడీపీ గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు.
సొంతపార్టీ వారికే అందనంతగా..
ప్రతిపక్షంపై ఎంతగా విరుచుకుపడితే సొంత పార్టీకి అంత లాభమే. ప్రస్తుత రాజకీయాలు కూడా అలానే ఉన్నాయి. ఎదుటివాడు కొడతా అనేలోపు కొట్టి చూపాల్సిన పరిస్థితులు. ఇదే పద్దతి అవలంబిస్తున్న అప్పలరాజు సొంత జిల్లా నేతలకు కూడా చుక్కలు చూపిస్తున్నారని వినికిడి. శ్రీకాకుళంలో ఉద్దండ నేతలుగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి, మంత్రిగా, తమ్మినేని సీతారాం ఏకంగా స్పీకర్ గా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి కూడా అందనంత స్పీడుగా అప్పలరాజు స్పీడ్ ఉందని అంటున్నారు. ధర్మాన, తమ్మినేని తమదైన స్టైల్లో విమర్శలు, కౌంటర్లు వేస్తున్నారు. కానీ.. అప్పలరాజు స్పీడ్ వారికి ఇబ్బందిగా మారిందని జిల్లాలో సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారని అంటున్నారు. జిల్లాపై పట్టు కాదు.. జిల్లాలో రాజకీయంగా పట్టు పెంచుకునే క్రమంలో, సీఎం జగన్ వద్ద మంచి మార్కులు కొట్టేందుకే ఈ స్పీడు అంటున్నారు. అప్పలరాజు స్పీడు కౌంటర్లు పార్టీపై నెగటివ్ ఎఫెక్ట్ చూపకపోయినా.. జిల్లాలో ఆధిపత్య పోరుకు తెర లేస్తోందని అంటున్నారు. ఇదే ముదిరితే శ్రీకాకుళం రాజకీయాలు జగన్ కు తలనొప్పి తెప్పించడం ఖాయమే అంటున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పటికే సైలెంట్ కాగా.. కొత్త తరంగా వచ్చిన అప్పలరాజు అందుకోవడమూ కష్టమే అంటున్నారు.
జగన్ దృష్టి పెట్టాల్సిందేనా..?
ప్రస్తుతం సీఎం జగన్ కు ఇలాంటి వ్యవహారాల్ని పట్టించుకునే సమయం లేదు. ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు నెలకొన్న కృష్ణా జిల్లా గన్నవరం పరిస్థితులనే సమయం వచ్చినప్పుడు కానీ.. పట్టించుకోవడం లేదు. వాటితో పోలిస్తే శ్రీకాకుళంలో మంత్రి వ్యవహారం చాలా చిన్నదే. ఇంకా మొగ్గ దశలోనే ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీ పిల్లి సుభాస్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు అంశం తరహాలో పెద్దదైతేనే సీఎం దృష్టి సారిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం చాప కింద నీరులా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మంత్రి అప్పలరాజు స్పీడు సొంత పార్టీలో నిప్పు రాజేయకుండా చూసుకుంటే బెటర్. అసలే.. జిల్లా నుంచి ముగ్గురు జగన్ ఇలాకాలో ఉన్నారు. అంటే.. శ్రీకాకుళం జిల్లాకు జగన్ అధిక ప్రాముఖ్యత ఇచ్చినట్టే.