గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం టిడిపి అభ్యర్థి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు ఈ వారెంట్ను జారీ చేసింది.
వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది. ప్రభుత్వం తనకు రక్షణ ఇవ్వడం లేదంటూ వంశీ ప్రైవేటు భద్రత సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో వంశీ వద్ద అక్రమ ఆయుధాలు లభించాయని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
2013లో వంశీ ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. వంశీ అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు నాన్బెయిలబుల్ వారెంట్తో పాటు కేసును కూడా కొట్టేసింది.
అయితే ఈ కేసుకు సంబంధించి ఆయన ఇప్పటి వరకూ విచారణకు హాజరుకాలేదు. దీనిపై దృష్టిసారించిన తెలంగాణ పోలీసులు వంశీ విచారణకు హాజరుకావడం లేదంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మేరకు నాంపల్లి కోర్టు వంశీకి నాన్బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది.
దీనిపై వంశీ స్పందించారు. ఈ కేసును 2013లోనే హైకోర్టు కొట్టివేసిందనీ, ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. హైకోర్టు తీర్పు ప్రతిని నాంపల్లి కోర్టుకు నివేదిస్తానని వంశీ తెలిపారు.