రాజధాని అంశం ఏపీలో ఎంత హాట్ టాపిక్కో తెలిసిన విషయమే. ఆ రాజధాని ప్రాంతం ఎక్కువగా ఉన్న తుళ్లూరు నియోజకవర్గం కూడా రాజకీయంగా అంతే వార్తల్లో నిలుస్తోంది. కారణం.. నియోజవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ఆమె వ్యవహారశైలి, ఆమెపై వస్తున్న వివాదాలు శ్రీదేవికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో ఆమెకు చాప కింద నీరులా వస్తున్న వ్యతిరేకత, రాజకీయ పోటీ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని సమాచారం. రాజధాని ప్రాంతం ఎక్కువగా ఆ నియోజకవర్గంలోనే ఉంది. ఆ ప్రాంతానికే చెందిన ఎంపీ నందిగం సురేశ్ తో ఏర్పడిన వివాదం సమసిపోయింది అనుకుంటే డొక్కా మాణిక్యవరప్రసాద్ రూపంలో ఆమె మరో పోటీని ఎదుర్కొంటున్నారు.
రాజకీయంగా ఆమెకు పోటీ వస్తున్నారా..
నియోజకవర్గంలో అంతా తానే అయి నడిపించాలని భావించిన ఆమెకు ఇప్పుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ రూపంలో తనకు పోటీ వస్తున్నారని తెలుస్తోంది. డొక్కా ఆ ప్రాంతంలో పేరున్న నేత. కాంగ్రెస్ హయాంలో అక్కడి నుంచే గెలిచి మంత్రి కూడా అయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి తాడికొండ టికెట్ లభించలేదు. ఎన్నికల తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో మళ్లీ తన పట్టు సాధిస్తున్నారు. ఇదే శ్రీదేవికి మింగుడు పడడంలేదని తెలుస్తోంది. ప్రస్తుత రాజధాని వికేంద్రీకరణ పరిస్థితులతో ఆమెపై అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో తాడికొండ నియోజకవర్గంలో డొక్కాను ప్రత్యామ్నాయంగా పార్టీ భావిస్తోందని వార్తలు వస్తున్నాయి.
అధిష్టానం వద్ద పరిస్థితి ఇదీ..
ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే కాకముందే డాక్టర్ గా ఆ ప్రాంతంలో పేరు ఉంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆమె తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆమె అనుచరులు పేకాట క్లబ్బులు నిర్వాహణ ఆరోపణలు, పోలీసులను ఆమె బెదిరించడం వంటి అంశాలతో వార్తల్లో నిలిచారు. దీంతో వైసీపీ అధిష్టానం వద్ద ఆమెకు మైనస్ మార్కులు ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా తన హవాకు ఎదురులేకుండా చేయాలని ఆమె అధిష్టానం వద్ద చెప్పుకునే పరిస్థితులు కానీ.. ఆమెను పట్టించుకునే వారు కానీ లేరని వార్తలు వస్తున్నాయి. దీంతో రాజకీయంగా, వ్యక్తిగత వ్యవహారశైలితో పార్టీలో కూడా ఆమె వ్యతిరేకమవుతున్నారని అంటున్నారు