Prasanth Kishore: పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ తెలుగు రాజకీయాలకు బాగా తెలిసిన పేరు.. తెలుగే కాదు దేశ రాజకీయాలు మొత్తానికి బాగా తెలిసిన పేరు.. కేవలం బుర్రలో ఆలోచనలతో రాజకీయాలను శాసించి, సీఎం సీట్లు డిసైడ్ చేసే స్థానానికి ఎదిగారు ఈ బీహారీ.. రాజ్యాంగంలో లేని “పొలిటికల్ స్ట్రాటజీ” అనే పదాన్ని సృష్టించి.., పార్టీలతో జతకట్టి.. పార్టీలను గెలిపించి.., రాష్ట్రాల రాజకీయాలను ఆసాంతం చదివేసారు. 2014 ఎన్నికల నాటికి బీజేపీతో మొదలైన ఆయన ఎన్నికల స్ట్రాటజీ వ్యాపారం ప్రస్తుతం దేశమంతా విరాజిల్లుతుంది. వందల కోట్ల విలువైన పొలిటికల్ కాంట్రాక్టులు వచ్చి పడుతున్నాయి… ఇక ఆయనకూ బోర్ కొట్టేసినట్టుంది, అందుకే ఆ స్ట్రాటజీని సీఎం సీటికి కాకుండా ప్రధాని సీటుకి కూడా డిసైడ్ చేసే స్థాయికి వెళ్లాలని బాగా ఫిక్సయ్యారు. అందుకే ఈ మధ్య మాటలు, అడుగులు, భేటీలు మారుతున్నాయి..
తాజా లక్ష్యం – 2024 లో బీజేపీ దిగడం..!!
తాజాగా పీకే ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 2014 లో తాను అందలమెక్కించిన బీజేపీని గద్దె దించాలనేది ఆ పెద్ద లక్ష్యం.. అందుకు తన సొంత రాష్ట్రం బీహార్ లో జరిగిన రాజకీయ మార్పులే కారణం.. బీజేపీని ఇప్పుడున్న పరిస్థితుల్లో గద్దె దించాలి అంటే అంత సులువు కాదు. ఒక పెద్ద స్ట్రాటజీ వేయాలి. అందులో మొదటిది బీజేపీ/ ఎన్డీఏ యేతర పక్షాలన్నిటినీ ఏకం చేయడం.. పీకే ఆ పనిలోనే ఉన్నారు.. ఆల్రెడీ మమతా బనెర్జీ, వైఎస్ జగన్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ లాంటి పెద్ద పెద్ద ప్రాంతీయ పార్టీల నేతలు ఆయనతో ఉన్నారు. ఇక మిగిలిన పక్షాలను కలిపేసి.. ఒక దండగా చేసేసి కాంగ్రెస్ మేడలో వేయడమే ఆయన పని.. అందుకే గడిచిన వారం రోజుల నుండి వరుసగా భేటీలు, వ్యూహాలు, ట్వీట్లు వేస్తున్నారు.. నిన్న సాయంత్రమే ఎన్సీపీ శరద్ పవార్ ని కలిశారు. రేపో, ఎల్లుండో కేసీఆర్ ని కలవనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. రాహుల్ ప్రధాని అయితే రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుందని, ప్రాంతీయ పార్టీలపై పెత్తనం ఉండదని.., ఆ పార్టీకి సహకరించాలని.. బీజేపీకి ఎలాగూ భవిష్యత్తు లేదని.. మీరు సహకరిస్తే మిగిలిన పని తాను చూసుకుంటానని ఒక్కొక్కరికీ రాయబారం, రాయబేరాలు పంపుతున్నారు..!
ఏపీలోనే భిన్నంగా పీకే స్థితి..!!
ఇతర రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఏపీలో మాత్రం పీకే పరిస్థితి భిన్నంగా మారిపోయింది. 2019 ఎన్నికల్లో ఆయన వైసిపికి పని చేసారు. జగన్ తో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ పీకే కి ప్రధాన రాజకీయ శత్రువుగా ఉన్న బీజేపీతో జగన్ కనిపించని దోస్తీ చేస్తున్నారు. అది పీకేకి నచ్చడం లేదు. బీజేపీని వదిలి జగన్ బయటకు రాలేరు. ఈ స్థితిలో ఏపీలో టీడీపీతో జతకట్టాలా..? జగన్ నే నెమ్మదిగా బీజేపీ నుండి తప్పించాలా..!? అనే ఆలోచనల్లో పీకే ఉన్నారట. టీడీపీ వైపు నుండి పీకే పట్ల సానుకూలత ఉంది. ఆయనను వచ్చే ఎన్నికల నాటికి వాడుకోవాలని చూస్తున్నారు. కాకపోతే ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి..!? ఏపీ లో ఏ పార్టీతో జత కడతారు అనేది చూడాల్సి ఉంది..!