న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలలో బిజెపికి ఘనవిజయం సాధించిపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులనీ, వారి తీర్పు శిరోధార్యమనీ ఆయన అన్నారు. ఎటువంటి పరిస్థితులలోనూ ప్రేమతో జవాబు ఇచ్చే పద్ధతిని కొనసాగిస్తానని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పోరాటం వ్యక్తులపై కాదనీ, పోరాటం విధానాలపైనే అన్న విషయం తాను అనేకసార్లు స్పష్టం చేశానని రాహుల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ నాయకులకూ, పార్టీ కార్యకర్తలకూ అందరికీ రాహుల్ ధన్యవాదాలు తెలుపారు. తమ పార్టీ విధానాలకు మద్దతు ఇస్తున్న ప్రజలు చాలామంది ఉన్నారనీ, కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు.
అమేఠీలో పరాజయం గురించి ప్రస్తావించినపుడు, విజయం సాధించిన స్మృతి ఇరానీకి రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు. అమేఠీ ప్రజలను ఆమె ప్రేమతో చూసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.