గీతం విద్యాసంస్థల ప్రాంగణంలోని పలు ప్రాంగణాలను అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం, వైసీపీ మధ్య కామెంట్ల పరంపర కొనసాగుతుండగా తాజాగా కీలక అంశం తెరమీదకు వస్తోంది.
మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వానికి సంబంధించిన రూ. 800 కోట్ల విలువైన 40 ఎకరాల భూముని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించుకుని కొన్నేళ్ళుగా ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. డబ్బు, అధికారం ఉన్నవాడు 40 ఎకరాలు కబ్జా చేస్తే ఊరుకోవాలా ? అని ప్రశ్నించారు.
చంద్రబాబు షాకిచ్చారా?
గీతం ఆక్రమించుకున్న భూమిని రెగ్యులరైజ్ చేయాలని 2014లో గీతం యాజమాన్యం అప్లికేషన్ పెట్టారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. “ఇప్పుడు అక్రమం, అన్యాయం అని మాట్లాడే వాళ్ళంతా గత 5 ఏళ్ళు ఏం చేశారు? ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదు…? గత 5 ఏళ్ళూ అధికారంలో ఉంది చంద్రబాబునాయుడే కదా… గీతం యాజమాన్యం చంద్రబాబు బంధువులే కదా..! మరి ఎందుకు క్రమబద్దీకరించలేదు? చంద్రబాబుకు, లోకేష్ కు గీతం విద్యా సంస్థల వ్యవస్థాపకుడు మూర్తి గారి మీద ప్రేమ లేదు. ఈరోజు రాజకీయం కోసం వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తున్నారు. “ అంటూ మండిపడ్డారు.
మాకు అలాంటి ఫీలింగ్స్ లేవు
రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, ముఖ్యమంత్రి గారికి గానీ ఎవరి మీద వ్యక్తిగతంగా ఎటువంటి విద్వేషాలు, కక్ష సాధింపులు లేవు. రాజకీయం కోసమే చంద్రబాబు ఈరోజు గీతం యాజమాన్యం మీద లేని ప్రేమ చూపిస్తున్నారు. చంద్రబాబు అరాచకాలకు, భూదందాలకు ప్రజలు కన్నెర్ర చేసి, 23 సీట్లకు పరిమితం చేసి మూలన కూర్చోబెట్టారు. అయినా ఆయన ఆలోచనా విధానంలో ఇంకా మార్పు రాలేదు. ఏ ప్రభుత్వానికి అయినా, ఏ నాయకుడికి అయినా కొన్ని విధానాలు ఉంటాయి. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ విధానం ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయడం అయితే… చంద్రబాబు విధానం ప్రైవేట్ సంస్థలను అభివృద్ధి చేయడం“ అంటూ విరుచుకుపడ్డారు.
మూడు రాజధానులు…
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, వికేంద్రీకరణ వల్లే అది సాధ్యం అని మూడు రాజధానులు తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. “అమరావతి ఒక్కటి బాగుంటే చాలు అన్నది చంద్రబాబు విధానం -ఈ ప్రభుత్వ విధానం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుండాని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. చంద్రబాబు విధానం కొన్ని వర్గాలకు మాత్రమే మేలు జరగాలని చూసింది. అందుకే వారికి మా విధానాలు నచ్చట్లేదేమో.“ అని మంత్రి అవంతి పేర్కొన్నారు.